JanaSena Party : మరో జనసేన నేతపై లైంగిక ఆరోపణ
ఇప్పటికే రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను పెళ్లి పేరుతో మోసం చేశారని హర్షవీణ అనే యువతి ఆధారాలతో సహా బయటకు రావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వివాదానికి తోడు, ఎమ్మెల్యే అనుచరులు సదరు యువతిని
- Author : Sudheer
Date : 09-04-2026 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగి, కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఒకవైపు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాలనలో తనదైన ముద్ర వేస్తుంటే, మరోవైపు పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ఇటీవలే రైల్వేకోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలు సంచలనం సృష్టించగా, తాజాగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మరో నేతపై ఒక మహిళ బహిరంగంగా ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామాలు జనసేన శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుండగా, ప్రత్యర్థి పార్టీలకు విమర్శనాస్త్రాలుగా మారాయి.
వీరవాసరం జెడ్పీటీసీపై సంచలన ఆరోపణలు
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ జయప్రకాశ్ నాయుడు తనను శారీరకంగా, ఆర్థికంగా మోసం చేశారని ఒక మహిళ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేయడం ఇప్పుడు వైరల్గా మారింది. పవన్ కల్యాణ్ అంటే ఉన్న అభిమానంతో పార్టీలో చురుగ్గా ఉంటున్న జయప్రకాశ్, తనను లోబర్చుకోవడమే కాకుండా భారీగా డబ్బు, నగలు కూడా తీసుకున్నారని బాధితురాలు వీడియోలో పేర్కొన్నారు. జయప్రకాశ్ నాయుడు వంటి కీలక నేతపై ఇలాంటి ఆరోపణలు రావడం, దానికి సంబంధించిన వీడియోలు ఎక్స్ (ట్విట్టర్) వంటి వేదికలపై హల్చల్ చేయడం పార్టీ వర్గాలను ఆత్మరక్షణలో పడేశాయి. ఈ వ్యవహారంపై నిజానిజాలు ఇంకా తేలాల్సి ఉంది.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదం – పార్టీకి తలనొప్పి
ఇప్పటికే రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను పెళ్లి పేరుతో మోసం చేశారని హర్షవీణ అనే యువతి ఆధారాలతో సహా బయటకు రావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వివాదానికి తోడు, ఎమ్మెల్యే అనుచరులు సదరు యువతిని, ఆమె తరపు న్యాయవాదిని నడిరోడ్డుపై చితకబాదడం వంటి ఘటనలు జనసేన క్రమశిక్షణపై ప్రశ్నలు లేవనెత్తాయి. 100 శాతం స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన జనసేన నేతలు, అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలోనే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం సేనానికి తలనొప్పిగా మారింది. ఇవి నిజంగానే జరిగిన ఘటనలా లేక రాజకీయ వ్యూహంలో భాగంగా చేస్తున్న కుట్రలా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది.