Amaravati: అమరావతికి మహర్దశ! ఐకానిక్ నిర్మాణాలకు త్వరలో టెండర్లు ప్రారంభం
- By Kode Mohan Sai Published Date - 11:00 AM, Tue - 15 October 24

అమరావతి: ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవడానికి సీఆర్డీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా, శాసనసభ, హైకోర్టు, సచివాలయం మరియు వివిధ శాఖల కార్యాలయ భవనాల డిజైన్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
అడ్మినిస్ట్రేటివ్ సిటీ ప్లానింగ్కు సంబంధించి, 2018లో లండన్కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ ఐకానిక్ భవనాల ఆకృతులను రూపొందించింది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత, అమరావతి నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకురావాలని నిర్ణయించబడింది. ఈ నేపథ్యం లో, ఐకానిక్ భవనాల ఆకృతులపై ఉన్నత స్థాయిలో చర్చలు జరిగాయి.
దాదాపు ఆరు సంవత్సరాల క్రితం రూపొందించిన ఆ ఆకృతులలో మార్పులు చేయాలా అన్న అంశంపై చర్చ జరిగింది. అందువల్ల, బాహ్య ఆకృతుల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని, అవసరమైతే అంతర్గతంగా కొన్ని సవరణలు చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే మార్పులు జరగాలంటే, మరో ఏడాదిన్నర సమయం వృథా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇంకా, హైకోర్టు మరియు సచివాలయ టవర్ల పునాదులు ఇప్పటికే పూర్తయినందున, ఇప్పుడు ఆకృతులను మార్చడం సరికాదన్న అభిప్రాయానికి ఏపీ ప్రభుత్వం వచ్చింది.
ఆర్కిటెక్ట్ల కోసం సీఆర్డీఏ టెండర్ల ఆహ్వానం:
మరోవైపు, ఐకానిక్ బిల్డింగ్స్ డిజైన్లకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ఆర్కిటెక్ట్ నియామకం కోసం సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఈ ప్రాధమిక సమావేశానికి లండన్ సంస్థ నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు కూడా హాజరు అవటం గమనార్హం. ఆ సంస్థ కూడా బిడ్ దాఖలు చేసినట్లు సీఆర్డీఏ భావిస్తోంది. మరికొన్ని రోజుల్లో ఆర్కిటెక్ట్ను ఖరారు చేయనున్నారు. హైకోర్టు మరియు సచివాలయ భవనాల పునాదులు పటిష్టంగా ఉన్నాయని చెన్నై ఐఐటీ నిపుణులు తెలియజేసారు, అందువల్ల ఆ భవనాల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవడం కోసం సీఆర్డీఏ ఏర్పాట్లు చేస్తోంది.
భవనాల రూపకల్పన ఇలా:
అప్పట్లో శాసనసభ భవనాన్ని బోర్లించిన లిల్లీపువ్వు ఆకారంలో, హైకోర్టును బౌద్ధ స్తూపం స్ఫూర్తితో రూపొందించారు. సచివాలయాన్ని మరియు విభాగాధిపతుల కార్యాలయాలను ఐదు టవర్లుగా, డయాగ్రిడ్ విధానంలో నిర్మించాలని ఆలోచించారు. అప్పటి అంచనాల ప్రకారం, వాటి నిర్మాణ వ్యయం 11,752 కోట్లు. శాసనసభ భవనం నిర్మిత ప్రాంతం 11.67 లక్షల చదరపు అడుగులు, హైకోర్టు భవనం 16.85 లక్షల చదరపు అడుగులు, సచివాలయం మరియు విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మిత ప్రాంతం 68.88 లక్షల చదరపు అడుగులుగా ఉంది.
మళ్లీ అదే సంస్థ ఆసక్తి:
2019కి ముందు తెలుగుదేశం హయాంలో అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యాన్ని పొందిన ప్రముఖ కంపెనీలు మళ్లీ అటువంటి అవకాశాలను వెతుకుతున్నాయి. ప్రఖ్యాత నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ కంపెనీ రాజధాని నిర్మాణంలో మళ్లీ భాగస్వామిగా మారడానికి ఆసక్తి చూపడం ఇందుకు ఉదాహరణ. జగన్ ప్రభుత్వంలో ఈ కంపెనీ అనేక కష్టాలను ఎదుర్కొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నార్మన్ ఫోస్టర్ వంటి సంస్థలకు అనేక ఇబ్బందులు కలిగించింది.
సీఆర్డీఏతో చేసిన అగ్రిమెంట్లను కాలరాసింది, బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టింది. చివరకు, బకాయిలను వసూలు చేసేందుకు నార్మన్ ఫోస్టర్ సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. ఇన్నేళ్ల అనంతరం, నార్మన్ ఫోస్టర్ మళ్లీ ముందుకు వస్తుందని సీఆర్డీఏ ఊహించలేదు. కానీ ప్రీబిడ్ మీటింగ్లో హాజరైనది, ఆ కంపెనీ ఆసక్తిగా ఉందని చూపిస్తోంది. ప్రీబిడ్ మీటింగ్కు మాత్రమే హాజరయ్యిందా లేక బిడ్ కూడా దాఖలు చేసిందా అనేది స్పష్టత రాలేదు. అయితే, ఆ సంస్థ బిడ్ దాఖలు చేసినట్లయితే, దానికే టెండరు ఖరారైతే సమయం ఆదా అవుతుందని సీఆర్డీఏ భావిస్తోంది.