Liquor Rates : ఏపీలో మద్యం రేట్లను తగ్గించిన 11 కంపెనీలు
ఆయా బ్రాండ్లను బట్టి ఒక్కో క్వార్టర్ ధర ఎమ్మార్పీపై రూ.30 వరకూ తగ్గంది. దీంతో మద్యం ప్రియులకు ఊరట కలిగింది.
- By Latha Suma Published Date - 01:03 PM, Sat - 21 December 24

Liquor Rates: కొత్త సంవత్సరం వేళ ఏపీలో మందు బాబులకు ఇక పండగే. ఏపీలో మద్యం కనీస ధరను భారీగా పెంచేసిన సరఫరా కంపెనీల్లో కొన్ని ఇప్పుడు వాటంతట అవే రేట్లను తగ్గించుకున్నాయి. దాదాపు 11 కంపెనీలు వాటి కనీస ధరను తగ్గించుకున్నాయి. ఫలితంగా ఆయా కంపెనీల నుంచి రాష్ట్ర బెవరేజస్ సంస్థ మద్యం కొనే ధర తగ్గింది. ఆయా బ్రాండ్లను బట్టి ఒక్కో క్వార్టర్ ధర ఎమ్మార్పీపై రూ.30 వరకూ తగ్గంది. దీంతో మద్యం ప్రియులకు ఊరట కలిగింది.
వైఎస్ఆర్సీపీ పాలనలో అప్పటి సర్కార్ పెద్దలు ఆయా కంపెనీల నుంచి కమీషన్లు తీసుకునేందుకు వీలుగా వాటికి చెల్లించే మూల ధరల్ని భారీగా పెంచేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం తీసుకొచ్చి వినియోగదారుల డిమాండ్కి అనుగుణంగా, పారదర్శకంగా ఆర్డర్లు ఇస్తుంది. ఈ క్రమంలోనే దాదాపు 11 కంపెనీలు వాటి బేసిక్ ప్రైస్ను తగ్గించుకున్నాయి.
వీటి ధరలు తగ్గాయి..
. మాన్షన్ హౌస్ క్వార్టర్ ధర 2019లో గత టీడీపీ ప్రభుత్వంలో రూ.110 ఉండగా వైఎస్ఆర్సీపీ పాలనలో మొదట్లో రూ.300కు విక్రయించారు. దీనిపై విమర్శలు రావడంతో రూ.220కి తగ్గించారు. అయితే ప్రస్తుతం దీని క్వార్టర్ ధర రూ.220 నుంచి రూ.190కి తగ్గింది. ఇందులో హాఫ్ బాటిల్ ధర రూ.440 ఉండగా రూ.380కి, ఫుల్ బాటిల్ ధర రూ.870 నుంచి రూ.760కి తగ్గింది.
. రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 నుంచి రూ.210కి తగ్గింది. ఫుల్ బాటిల్ ధర రూ.920 నుంచి రూ.840కి తగ్గింది.
. యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ధర రూ.1600 కాగా రూ.1400కు తగ్గింది.
ఇకపోతే..ప్రస్తుతం మద్యం దుకాణాల్లో పాత ధరలతో ఉన్న బాటిళ్లను ఆదే ధరలకే విక్రయిస్తారు. కొత్తగా వచ్చే వాటికి తగ్గించిన ధరలతో అమ్మనున్నారు. ఏపీలో గత ఐదు సంవత్సరాల్లో ప్రముఖ బ్రాండ్ల విక్రయాలకు అవకాశం ఉండేది కాదు. తాజాగా అన్ని బ్రాండ్లను విక్రయించుకోడానికి అనుమతిస్తున్నారు. కాగా, ఇటీవలే ఏపీలో లిక్కర్ ధరలను తగ్గించడానికి మూడు మద్యం కంపెనీలు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ సంస్థల ప్రతిపాదనలకు ఎక్సైజ్ శాఖ ఆమోదం తెలిపింది. తగ్గించిన ధరలను అమల్లోకి తెస్తూ ఉత్తర్వులిచ్చింది.