CM Chandrababu : కాసేపట్లో సీఎంగా చంద్రబాబు ప్రమాణం.. కేసరపల్లిలో సర్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
- By Pasha Published Date - 08:57 AM, Wed - 12 June 24
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం వేదికగా ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) ఎయిర్ పోర్టుకు వెళ్లి ప్రధానికి స్వయంగా స్వాగతం పలికి రిసీవ్ చేసుకోనున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ప్రధాని రాక నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మంగళవారం సాయంత్రమే ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే రూట్లో ట్రయల్ రన్ నిర్వహించారు. ఇక ప్రధానమంత్రి మోడీ కోసం ప్రత్యేకంగా వేదికకు అత్యంత సమీపంలో గ్రీన్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్షా, నడ్డా , ఇతర కేంద్ర మంత్రులు ఈ గ్రీన్ రూమ్కు చేరుకుంటారు. ప్రధాని గ్రీన్ రూమ్కు వెనుకభాగంలో పీఎంవో సిబ్బంది కోసం మరో రూమ్ను ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ కోసం మరో గ్రీన్ రూమ్ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా ఇంకొక గ్రీన్ రూమ్ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గ్రీన్ రూమ్ పక్కనే వీవీఐపీల కోసం ఇంకో గ్రీన్ రూమ్ ఉంది.
Also Read : Terrorists Attack : కశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి.. ఆర్మీ బేస్పై కాల్పులు.. ఒకరు మృతి
సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు చాలామంది మంగళవారం రాత్రి సమయానికే విజయవాడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీగా భద్రతా చర్యలు చేపట్టారు. దాదాపు 10వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. గన్నవరం విమానాశ్రయం, పరిసర ప్రాంతాలు, కేసరపల్లి సభా ప్రాంగణం లోపల, వెలుపల 7వేల మందికి భద్రతా విధులు కేటాయించారు. ఈ బాధ్యతలను 60మంది పైగా ఐపీఎస్ అధికారులకు అప్పగించారు. వీవీఐపీల వాహనశ్రేణి నేరుగా వేదిక వచ్చేందుకు వీలుగా ప్రత్యేక బీటీ రోడ్లను నిర్మించారు.
ఇవాళ సాయంత్రం తిరుమలకు చంద్రబాబు ఫ్యామిలీ
ఇవాళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం 6.45 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 7.45 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారు. రోడ్డుమార్గంలో రాత్రి 8.50 గంటలకు తిరుమలకు చేరుకుని అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం 7.30 గంటల నుంచి 8 మధ్య శ్రీవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం తిరిగి అమరావతికి చేరుకుంటారు.
Related News
Meeting Of CMs: ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే..!
తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు (Meeting Of CMs) ప్రజాభవన్ వేదికగా భేటీ అయ్యారు.