Sudan War : 3 రోజుల్లో 200 మంది మృతి.. సూడాన్లో రక్తపాతం
సూడాన్లో గత కొన్ని దశాబ్దాలుగా అంతర్యుద్ధం(Sudan War) జరుగుతోంది.
- By Pasha Published Date - 07:30 PM, Tue - 18 February 25

Sudan War : ఆఫ్రికా దేశం సూడాన్లో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈనెల (ఫిబ్రవరి) 15వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యకాలంలో వైట్ నైల్ రాష్ట్రంలో జరిగిన హింసాకాండలో 200 మందికిపైగా ప్రజలు చనిపోయారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారు. సూడాన్లోని పారామిలటరీ విభాగం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) బలగాలు ఈ మారణ హోమానికి తెగబడ్డాయి. చనిపోయిన వారంతా అల్ -కడారిస్, అల్-ఖేల్వాత్ గ్రామాలవారేనని వెల్లడైంది. ఈవిషయాన్ని ‘ఎమర్జెన్సీ లాయర్స్’ బృందం వెలుగులోకి తీసుకొచ్చింది.
Also Read :Division Of Husband : మొదటి భార్య, రెండో భార్య.. ఓ భర్త సంచలన నిర్ణయం
నదిలో మునిగి..
- ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) బలగాలు వైట్ నైల్ రాష్ట్రంలోని అల్ -కడారిస్, అల్-ఖేల్వాత్ గ్రామాలకు చెందిన మహిళలు, బాలికలను కిడ్నాప్ చేశారు
- పేదల ఆస్తులను కబ్జా చేశారు. నగలు, డబ్బును దోచుకున్నారు.
- నైలు నది దాటి పారిపోవడానికి యత్నించిన ఆ రెండు గ్రామాల ప్రజలను వెంటాడి కాల్చి చంపారు.
- ఆ గ్రామాలకు చెందిన పలువురు నదిలో మునిగి చనిపోయారు.
Also Read :Cognizant VS Infosys : ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ మధ్యలో రవికుమార్.. ఐటీ దిగ్గజాల ఢీ
అల్లర్లు ఇలా మొదలయ్యాయి..
సూడాన్లో గత కొన్ని దశాబ్దాలుగా అంతర్యుద్ధం(Sudan War) జరుగుతోంది. అక్కడి పారామిలిటరీ విభాగం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF), ఆర్మీ విభాగం ఆర్మ్డ్ ఫోర్సెస్ (SAF) మధ్య సైనికపరమైన ఆధిపత్యం కోసం ఘర్షణలు జరుగుతున్నాయి. 2023 ఏప్రిల్లో ఈ ఘర్షణలు మొదలయ్యాయి. సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దెల్ ఫత్తా అల్-బుర్హాన్, ఆర్ఎస్ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య జరిగిన గొడవలతో ఈ హింసాకాండ షురూ అయింది. నాటి నుంచి నేటి వరకు SAF, RSF మధ్య జరిగిన గొడవల్లో దాదాపు 16,650 మంది చనిపోయారు. ఈ హింసాకాండను తాళలేక కోటి మందికిపైగా ప్రజలు సూడాన్ను వదిలి వెళ్లిపోయారు. సూడాన్ ఒక్కటే కాదు ఆఫ్రికా ఖండంలోని చాలా దేశాల్లో ఇలాగే అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. వీటి వెనుక అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా లాంటి దేశాల నిఘా సంస్థలు ఉన్నాయి. భౌగోళికంగా తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవాలనే దీర్ఘకాలిక వ్యూహంతో ఇలాంటి మారణకాండ జరిగేలా ఆయా ధనిక దేశాలు వ్యూహాలను రహస్యంగా అమలు చేస్తుంటాయి. ఈక్రమంలో ఆయా ఆఫ్రికా దేశాల్లోని రాజకీయ నేతలను, సైనిక పెద్దలను పావుల్లా వాడుకుంటాయి. ఆఫ్రికా దేశాల్లోని సహజ వనరులపై పట్టు పోకుండా జాగ్రత్త పడుతుంటాయి. తమ అనుకూల వర్గాలే పేద ఆఫ్రికా దేశాల్లో అధికారంలో ఉండాలని ధనిక దేశాలు భావిస్తుంటాయి.