Earth Quakes: 1660 దాటిన మృతులు.. మయన్మార్, థాయ్లాండ్లలో భూవిలయం
మయన్మార్(Earth Quakes)లోని మండలేలో ఎక్కడ చూసినా కూలిన భవనాలే కనిపిస్తున్నాయి.
- By Pasha Published Date - 08:15 AM, Sun - 30 March 25

Earth Quakes: మయన్మార్, థాయ్లాండ్ దేశాలను భారీ భూకంపం కుదిపేసింది. దీంతో భారీ విధ్వంసం సంభవించింది. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజా అప్డేట్ ప్రకారం మయన్మార్, థాయ్లాండ్లలో మొత్తం మరణాల సంఖ్య 1660 దాటింది. ఒక్క మయన్మార్ దేశంలోనే దాదాపు 1,644 మంది చనిపోయారు. 3వేల మంది గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. ప్రస్తుతం మయన్మార్లో సైనిక పాలన ఉంది. దీంతో అక్కడి వైద్యారోగ్య వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అత్యవసర వైద్యసేవల విభాగాలు సరిగ్గా పనిచేయడం లేదు. సైనిక పాలన మొదలయ్యాక ఎంతోమంది వైద్యులు ఆ దేశం వదిలి వలస వెళ్లారు. అందువల్లే మయన్మార్లో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది.
Also Read :Ugadi: ఉగాది రోజు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- మయన్మార్లోని సాగింగ్కు వాయవ్యంగా శుక్రవారం మధ్యాహ్నం 12:50 గంటలకు 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉందని గుర్తించారు. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే 6.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. తదుపరిగా మరిన్ని చిన్న భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
- ఈ భూకంపం ప్రభావంతో భారతదేశం పశ్చిమ ప్రాంతం, చైనా సరిహద్దు ప్రాంతాలు, కంబోడియా, లావోస్లలోని భవనాలు కంపించాయి.
- మయన్మార్ పొరుగునే ఉన్న థాయ్లాండ్లో భూకంపం కారణంగా 10 మంది మరణించారు. ప్రధానంగా బ్యాంకాక్లోని చతుచక్ మార్కెట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక ఎత్తైన భవనం కూలిపోయింది. దీంతో 100 మంది కార్మికులు శిథిలాలలో చిక్కుకున్నారు.
Also Read :Satyanarayana Raju: ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన మరో ఆంధ్ర కుర్రాడు.. ఎవరీ సత్యనారాయణ రాజు?
- మయన్మార్(Earth Quakes)లోని మండలేలో ఎక్కడ చూసినా కూలిన భవనాలే కనిపిస్తున్నాయి.
- మయన్మార్లోని సాగింగ్ నుంచి ఇరావడీ నది వరకు విస్తరించి ఉన్న దాదాపు 100 సంవత్సరాల పురాతన అవా వంతెన కూలిపోయింది.
- మయన్మార్కు సహాయం అందించిన దేశాల్లో భారతదేశం ముందు వరుసలో నిలిచింది.
- మయన్మార్కు సహాయం చేయడానికి భారత వైమానిక దళం హిండన్ వైమానిక స్థావరం నుంచి టెంట్లు, దుప్పట్లు, నీటి శుద్ధి యంత్రాలు, అవసరమైన మందులు సహా 15 టన్నుల సహాయక సామాగ్రిని పంపింది.
- ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద భారతదేశం 80 మంది జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) సిబ్బందిని మయన్మార్కు పంపింది.
- భూకంప ప్రభావాన్ని అంచనా వేయడానికి థాయ్లాండ్ ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్ షినవత్రా నేతృత్వంలోని మంత్రిమండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. థాయిలాండ్లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించింది. అయితే అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించింది.
- థాయ్లాండ్, మయన్మార్లకు సహాయ సహకారాలను అందిస్తామని యూరోపియన్ యూనియన్, అమెరికా కూడా హామీ ఇచ్చాయి. మయన్మార్ సైనిక అధికారులతో తమ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.