Pakistan Economy Crisis: పాకిస్థాన్లో చమురు మంటలు.. రికార్డు స్థాయిలో ఇంధన ధరలు
- Author : Vamsi Chowdary Korata
Date : 25-03-2026 - 1:10 IST
Published By : Hashtagu Telugu Desk
Crude Oil ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధం ప్రపంచ ముడి చమురు సరఫరా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి మార్గంలో ఉద్రిక్తతలు పెరగడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రభావం పాకిస్థాన్ నుంచి ఈజిప్ట్ వరకు అనేక దేశాలను సంక్షోభంలోకి నెడుతోంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందనంతగా పెరిగిపోయాయి. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. మరోవైపు, ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే ఈజిప్ట్ కూడా పెరిగిన ధరలతో సతమతమవుతోంది. ఈ భారాన్ని తట్టుకోలేక ప్రభుత్వం ఇంధన సబ్సిడీలను తగ్గించే యోచనలో ఉండటంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఆఫ్రికా, ఆసియా దేశాలపై ప్రభావం…
ఈ ప్రభావం కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాలేదు. ఆఫ్రికా, ఆసియాలోని అనేక దేశాల్లో ఇంధన ధరల పెరుగుదల విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ రంగాలను దెబ్బతీస్తోంది. ఇది భవిష్యత్తులో ఆహార సంక్షోభానికి దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు 120-130 డాలర్లకు చేరితే, అభివృద్ధి చెందుతున్న దేశాల విదేశీ మారక నిల్వలు వేగంగా కరిగిపోతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది ఆయా దేశాల కరెన్సీ విలువ పతనానికి, అప్పుల భారం పెరగడానికి దారితీస్తుంది. మొత్తంగా ఈ యుద్ధ భారాన్ని సంపన్న దేశాల కంటే పేద, మధ్యతరగతి దేశాలే ఎక్కువగా మోస్తున్నాయని స్పష్టమవుతోంది.