Volcano Eruption : బద్దలైన అగ్నిపర్వతం.. గ్రామాలపై పడిన వేడి బూడిద.. 9 మంది మృతి
అగ్నిపర్వతం(Volcano Eruption) పేలుడుతో గాల్లోకి ఎగిసిన వేడివేడి బూడిద.. సమీపంలోని ఇళ్లపై పడింది.
- Author : Pasha
Date : 04-11-2024 - 10:38 IST
Published By : Hashtagu Telugu Desk
Volcano Eruption : అగ్నిపర్వతం అకస్మాత్తుగా బద్దలైంది. భారీ విస్ఫోటనాలు సంభవించాయి. విస్ఫోటనం ధాటికి దాదాపు 2వేల మీటర్ల ఎత్తున బూడిద ఎగిసి పడింది. ఇండోనేషియాలోని మౌంట్ లెవొటోబి లకిలకి అగ్నిపర్వతం పేలిన ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్నిపర్వతం(Volcano Eruption) పేలుడుతో గాల్లోకి ఎగిసిన వేడివేడి బూడిద.. సమీపంలోని ఇళ్లపై పడింది. దీంతో ఆ ఇళ్లకు మంటలు అంటుకున్నాయి.
Also Read :Temperatures Falling : పడిపోతున్న టెంపరేచర్స్.. పెరుగుతున్న చలి.. అక్కడ మైనస్ 50 డిగ్రీలు
ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. దీంతో అగ్నిపర్వతం పరిసరాల్లోని గ్రామాలను ఖాళీ చేయించే పనులను రెస్క్యూ టీమ్స్ నిర్వహిస్తున్నాయి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో ఇండోనేషియాలోని హల్మహెరా ద్వీపంలో ఉన్న ఇబు అగ్ని పర్వతం పేలింది. దీంతో 60 మందికిపైగా చనిపోయారు. ఈ ఘటనతో అగ్నిపర్వతం సమీపంలోని ఏడు గ్రామాలను ఖాళీ చేయించారు.
Also Read :Amaravati ORR : అమరావతి ఓఆర్ఆర్.. ఎలైన్మెంట్, డీపీఆర్పై కొత్త అప్డేట్
అగ్నిపర్వతం అంటే ఏమిటి ? ఎలా పేలుతుంది ?
భూగర్భంలోని శిలాద్రవం ఉపరితలాన్ని చేరడానికి ఉపయోగపడే నాళం లాంటి మార్గాన్ని ‘అగ్నిపర్వత నాళం’ అంటారు. దీని కింద భాగంలో శిలాద్రవపు నిల్వ (మాగ్మా ఛాంబర్), పైభాగంలో భూమి ఉపరితలంపై కుహరం ఉంటాయి. వీటి ద్వారా శిలాద్రవం, వేడి వాయువులు, రాతి ముక్కలు విస్ఫోటం చెందుతాయి. ఇవి కుహరం చుట్టూ శంకు ఆకారంలో ఘనీభవిస్తే దాన్నే మనం అగ్నిపర్వతం అని పిలుస్తాం. అగ్నిపర్వతంలోని వేడికి కఠిన శిలలు కూడా కరిగిపోతాయి. ‘అగ్నిపర్వత నాళం’లో ద్రవాల నిల్వలు భారీగా పేరుకుపోయినప్పుడు.. ఒక్కసారిగా భారీ విస్ఫోటం సంభవిస్తుంది. ద్రవాల నిల్వలు అగ్నిపర్వతంలోని చీలికలు, బీటల నుంచి చొచ్చుకొని వచ్చి భూమిపైకి విరజిమ్ముతాయి. ఆ తర్వాత ద్రవాలన్నీ ఘనీభవించి లావాగా మారుతాయి. అవి కూడా పొరలుగా పెరిగి పర్వతాలుగా మారుతాయి. మొత్తం మీద అగ్నిపర్వతంలో ఎంతో సంక్లిష్ట, సున్నిత నిర్మాణం ఉంటుంది.