2000 People Buried Alive : 2వేల మందికిపైగా సజీవ సమాధి.. కొండచరియల బీభత్సం
కొండ చరియలు బీభత్సం క్రియేట్ చేశాయి. వాటి కింద నలిగిపోయి దాదాపు 2వేల మంది ప్రాణాలు విడిచారు.
- By Pasha Published Date - 04:04 PM, Mon - 27 May 24

2000 People Buried Alive : కొండ చరియలు బీభత్సం క్రియేట్ చేశాయి. వాటి కింద నలిగిపోయి దాదాపు 2వేల మంది ప్రాణాలు విడిచారు. ఈ పెను విషాద ఘటన పసిఫిక్ దేశం పపువా న్యూగినియాలోని ఎంగా ప్రావిన్స్లో ఉన్న ఎంబాలి గ్రామంలో శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. 100 మంది చనిపోయారంటూ ప్రమాదం జరిగిన రోజున వార్తలు వచ్చాయి. అయితే రెస్క్యూ వర్క్ జరుగుతున్న కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతూపోయింది. చివరికి సోమవారం ఉదయం సమయానికి మరణాల కౌంట్ 2000 దాటిపోయింది. కొండచరియల కింద ఎంబాలి గ్రామం చితికిపోయింది. దాదాపు నాలుగు ఫుట్ బాల్ గ్రౌండ్లకు సమానమైన సైజులో ఉన్న ఈ ఊరు మట్టి దిబ్బగా మారిపోయింది. వందలాది ఇళ్లు నామరూపాల్లేకుండా రాళ్లకుప్పలుగా మారాయి. శుక్రవారం వేకువజామున గాఢ నిద్రలో ఉన్న గ్రామస్తుల్లో దాదాపు 2వేల మంది కొండచరియల కింద చితికి సజీవ సమాధి అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ ఘటన బాధిత కుటుంబాల్లో ఎంతటి విషాదాన్ని మిగిల్చి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. తమ వారు ఇక లేరని.. తిరిగి రారని.. చనిపోయిన వారి కుటుంబీకులు వెక్కివెక్కి ఏడుస్తున్నారు. చనిపోయిన వారి సంఖ్య 2వేలు దాటిందని పపువా న్యూగినియా దేశ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వందలాది ఇళ్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపింది. ఈ ఘటనతో దాదాపు 1,250 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొంది. ఈ మేరకు సమాచారంతో సోమవారం ఐక్యరాజ్యసమితికి ఓ లేఖ రాసింది. మారుమూల ప్రాంతం కావడం, స్థానికుల గిరిజనుల మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా ఎంబాలి గ్రామంలో రెస్క్యూ కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోంది. మృతుల సంఖ్య(2000 People Buried Alive) మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. కొండ చరియలు విరిగిపడే సమయానికి ఎంబాలి గ్రామంలో మొత్తం 4వేల మంది ప్రజలు ఉన్నారని తెలుస్తోంది. కొండచరియలు విరిగిపడిన ప్రదేశానికి విమానం, ఇతర పరికరాలను పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా వెల్లడించింది. ఎడతెరిపి లేని భారీ వర్షాల వల్లే కొండచరియలు విరిగి గ్రామంపై పడ్డాయని అంటున్నారు.