Asaduddin Owaisi : మజ్లిస్ నేతపై కాల్పులు.. అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్ ఇదీ
మహారాష్ట్రలో మజ్లిస్ పార్టీ నేత, మాలేగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్పై దుండగులు కాల్పులు జరిపిన ఘటనపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
- By Pasha Published Date - 03:23 PM, Mon - 27 May 24

Asaduddin Owaisi : మహారాష్ట్రలో మజ్లిస్ పార్టీ నేత, మాలేగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్పై దుండగులు కాల్పులు జరిపిన ఘటనపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. సోమవారం తెల్లవారుజామున నాసిక్లోని ఓ పెట్రోల్ పంపు సమీపంలో చోటుచేసుకున్న ఈ కాల్పుల వ్యవహారంపై విచారణ జరపాలని ఆయన మహారాష్ట్ర సర్కారును డిమాండ్ చేశారు. కాల్పులు జరిపిన దుండగులను పట్టుకోవాలని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను ఒవైసీ కోరారు. మహారాష్ట్రలోని బీజేపీ పాలనలో దుండగులు తుపాకులు చేతపట్టి పట్టపగలే పేట్రేగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుట్రపూరితంగానే తమ పార్టీ నేత అబ్దుల్ మాలిక్పై దాడికి పాల్పడ్డారని ఒవైసీ(Asaduddin Owaisi) ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join
మాలెగావ్ పోలీసుల కథనం ప్రకారం.. మోటర్బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మజ్లిస్ నేత మాలిక్పై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. వెంటనే స్పందించిన స్థానికులు మాలిక్ను ఆస్పత్రికి తరలించారు. బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో.. మాలిక్ ఛాతీ, కాలు, కుడి చేతిపై తీవ్రగాయాలయ్యాయి. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులు ఈ కాల్పులు జరపడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం అబ్దుల్ పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ బిహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో మజ్లిస్ నేత అబ్దుల్ సలామ్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గతేడాది డిసెంబరులో సివాన్కు చెందిన మజ్లిస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిని కొందరు దుండగులు మర్డర్ చేశారు.