Korean Air flight: 173 మందితో వెళ్తున్న విమానానికి ప్రమాదం..!
173 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నకొరియన్ ఎయిర్లైన్స్ జెట్ విమానం రన్వేను దాటి ముందుకెళ్లిన ఘటన ఫిలిప్పిన్స్లోని కెబూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.
- By Gopichand Published Date - 06:58 PM, Mon - 24 October 22

173 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నకొరియన్ ఎయిర్లైన్స్ జెట్ విమానం రన్వేను దాటి ముందుకెళ్లిన ఘటన ఫిలిప్పిన్స్లోని కెబూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. 162 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బందితో వెళ్తున్న కొరియన్ ఎయిర్లైన్స్ కో విమానం సెంట్రల్ ఫిలిప్పీన్స్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ల్యాండింగ్ సమయంలో రన్వేపైకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో విమానం ముందుభాగం భారీగా దెబ్బతింది. ఆదివారం అర్థరాత్రి తరువాత ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో ప్రయాణికులందరూ సురక్షితమేనని ఎయిర్ పోర్ట్ యాజమాన్యం తెలిపింది. ఘటన కొరియన్, స్థానిక ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేపడతారని, ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఎయిర్లైన్స్ తెలిపింది. “మేము ఎల్లప్పుడూ మా అన్ని కార్యకలాపాలలో భద్రతకు ప్రాధాన్యతనిస్తాము. మా ప్రయాణీకులకు తెచ్చిన ఒత్తిడి, అసౌకర్యానికి మేము నిజంగా చింతిస్తున్నాము” అని కొరియన్ ఎయిర్ ప్రెసిడెంట్ వూ కీహోంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. విమానం ముందు భాగంలోని అండర్బెల్లీ తెగిపోయి దాని ముందు భాగం బాగా దెబ్బతింది.
దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నుండి వెళ్తున్న ఎయిర్బస్ A330 మూడవ ప్రయత్నంలో రన్వేను అధిగమించడానికి ముందు రెండుసార్లు ల్యాండ్ కావడానికి ప్రయత్నించింది. సాధ్యం కాకపోవటంతో మూడోసారి ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగినవెంటనే స్థానిక ఎమర్జెన్సీ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లి ప్రయాణికులందరిని విమానం ఎస్కేప్ స్లైడ్ల ద్వారా బయటకు దింపారు. 1981లో ఒక కొరియన్ ఎయిర్ లైన్స్ బోయింగ్ 747 జెట్లైనర్ మనీలా అంతర్జాతీయ విమానాశ్రయం నుండి టేకాఫ్ అవుతున్నప్పుడు ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 350 మందిలో పైగా డజనుకు పైగా గాయపడ్డారు.