Karachi: పాక్ లో వరుస ఉగ్రవాదుల హత్యలు
ఇటీవల కాలంలో పాకిస్థాన్ లో ఉగ్రవాదులు వరుసగా హతమవుతున్నారు. జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ సన్నిహిత అనుచరుడు రహీమ్ ఉల్లా తారీఖ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కరాచీలో ఓ మతపరమైన కార్యక్రమానికి వెళుతుండగా.
- Author : Vamsi Chowdary Korata
Date : 14-11-2023 - 3:07 IST
Published By : Hashtagu Telugu Desk
Karachi: ఇటీవల కాలంలో పాకిస్థాన్ లో ఉగ్రవాదులు వరుసగా హతమవుతున్నారు. జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ సన్నిహిత అనుచరుడు రహీమ్ ఉల్లా తారీఖ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కరాచీలో ఓ మతపరమైన కార్యక్రమానికి వెళుతుండగా.. తారిఖ్ను దుండగులు హత్య చేశారు. అయితే టెర్రరిస్టుల వరుస హత్యలతో పాకిస్థాన్ కలవరపడుతోంది.
జైషే ముఠా సభ్యుల మధ్య జరిగిన అంతర్గత తగాదాలే తారిఖ్ హత్యకు కారణమని తెలుస్తోంది. ఈ దాడిలో స్థానిక ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరాచీలోని మురికివాడగా పేరొందిన ఒరంగీ టౌన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో భాగంగా దుండగులు తారిఖ్పై వరుస కాల్పులు జరపడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు పాకిస్థాన్ స్థానిక మీడియా తెలిపింది. తారిఖ్ మరెవరో కాదు భారత్కు మోస్ట్ వాంటెడ్ జాదీష్-ఎ-మహ్మద్ చీఫ్ మసూద్ అజార్కు సన్నిహితుడు.
పాకిస్థాన్లో ఉగ్రవాదులు మరణించడం ఈ నెలలో ఇది మూడవదిగా తెలుస్తుంది. గత వారం లస్కరే తోయిబా కమాండర్ అక్రమ్ ఘాజీపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నెల మొదట్లో మరో లస్కర్-ఎలైట్ టెర్రరిస్ట్ కాశ్మీర్లో హతమయ్యాడు. ఇక తాజాగా పాక్ లో తారిఖ్ కాల్పుల్లో హతమయ్యాడు.
గత కొద్ది రోజులుగా పాకిస్థాన్లో ఉగ్రవాదులు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమవుతున్నారు. దీంతో ఉగ్రమూకలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. చాలా మంది ముష్కరులు భయంతో రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు.