భారత్ లో డీజిల్, పెట్రోలు పెరగనున్నాయా?
- Author : Vamsi Chowdary Korata
Date : 03-03-2026 - 1:18 IST
Published By : Hashtagu Telugu Desk
ఎల్పీజీ రేషనింగ్:
భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 80-85 శాతాన్ని గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుత నిల్వలు కేవలం రెండు వారాలకు మాత్రమే సరిపోతాయని అంచనా. ఈ నేపథ్యంలో గృహ అవసరాలకు సిలిండర్ల సరఫరాపై ప్రభుత్వం ‘రేషనింగ్’ (పరిమిత సరఫరా) విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కోత:
భారత్ తను ఉత్పత్తి చేసే పెట్రోల్లో మూడో వంతు, డీజిల్లో నాలుగో వంతు విదేశాలకు ఎగుమతి చేస్తుంది. దేశీయంగా కొరత రాకుండా ఉండటం కోసం ఈ ఎగుమతులను నిలిపివేసి, ఆ నిల్వలను స్థానిక వినియోగానికే మళ్లించాలని ప్రభుత్వం భావిస్తోంది.
చమురు నిల్వల పరిస్థితి ఏంటి..
కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సరఫరా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. భారత్ వద్ద ప్రస్తుతం ఉన్న వ్యూహాత్మక నిల్వలు, రిఫైనరీలు మరియు ఓడరేవుల్లోని నిల్వలు కలిపి సుమారు 74 రోజుల అవసరాలకు సరిపోతాయని ఆయన తెలిపారు. ముడి చమురు నిల్వలు: 17-18 రోజుల వరకు, శుద్ధి చేసిన ఇంధనాలు: 20-21 రోజుల వరకు, ఎల్ఎన్జీ నిల్వలు: 10-12 రోజుల వరకు సరిపోతాయి.
ప్రత్యామ్నాయ మార్గాల వేట..
గల్ఫ్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో భారత్ ఇప్పుడు రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను మరింత పెంచుకోవాలని చూస్తోంది. అలాగే అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి చమురు సేకరణకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం ‘‘రోజుల పాటు కాదు, వారాల పాటు’’ సాగే అవకాశం ఉందని హెచ్చరించడం భారత్ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలకు ఇంధన లభ్యతలో ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చమురు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.