Mass Jailbreaks : పరారీలోనే 700 మంది ఖైదీలు.. వారిలో 70 మంది ఉగ్రవాదులు!
ఆచూకీ దొరకని ఖైదీలలో(Mass Jailbreaks) పలువురికి.. ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయంగా పైచేయిని సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కీలక నేతల అండదండలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.
- Author : Pasha
Date : 05-12-2024 - 9:38 IST
Published By : Hashtagu Telugu Desk
Mass Jailbreaks : బంగ్లాదేశ్లో అశాంతి కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్ విద్యార్థులు ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో భారీ నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఆ సందర్భంగా చాలామంది నిరసనకారులు జైళ్లలోకి అక్రమంగా ప్రవేశించి వందలాది మంది ఖైదీలను విడిపించారు. బంగ్లాదేశ్లోని ఐదు ప్రధాన జైళ్లపై నిరసనకారులు దాడి చేసి.. దాదాపు 2,200 మంది ఖైదీలను తీసుకెళ్లారు. ఈవివరాలను స్వయంగా బంగ్లాదేశ్ జైళ్ల విభాగం అధిపతి సయ్యద్ మొహమ్మద్ మోతాహెర్ హుస్సేన్ వెల్లడించారు. అప్పట్లో పరారైన ఖైదీల్లో 1500 మందిని మాత్రమే పోలీసులు పట్టుకోగలిగారు. ఇంకా 700 మంది ఆచూకీ దొరకలేదట. వారంతా ఇంకా పరారీలోనే ఉన్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆచూకీ దొరకని ఖైదీలలో(Mass Jailbreaks) పలువురికి.. ప్రస్తుతం బంగ్లాదేశ్లో రాజకీయంగా పైచేయిని సాధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కీలక నేతల అండదండలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. వారి సపోర్ట్ వల్లే పోలీసులు కళ్లు కప్పి సదరు ఖైదీలు బంగ్లాదేశ్ ఉండగలుగుతున్నారని తెలుస్తోంది.
Also Read :Train General Coaches : గుడ్ న్యూస్.. ఇక ప్రతి రైలులో నాలుగు జనరల్ బోగీలు
పరారీలో ఉన్న 700 మంది ఖైదీల్లో దాదాపు 70 మంది ఉగ్రవాదులు, మరణశిక్షను ఎదుర్కోవాల్సిన ఖైదీలు ఉన్నారని జైలుశాఖ అధికారులు తెలిపారు. వీరు ఏ స్థాయి నేరాలు చేసి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వారికి రాజకీయ అండదండలు లభిస్తే.. బంగ్లాదేశ్లో అశాంతి ప్రబలే ముప్పు ఉంటుంది. ఉగ్రదాడులు జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికే బంగ్లాదేశ్లో హిందువులు లక్ష్యంగా మూకదాడులు జరుగుతున్నాయి. ఆ మూకలకు.. జైళ్ల నుంచి పరారైన కరుడుగట్టిన నేరగాళ్లు తోడైతే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారే ముప్పు ఉంటుంది. ఈవిషయమై ఇప్పటికే బ్రిటన్, అమెరికా, భారత్ లాంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. బంగ్లాదేశ్లో మైనారిటీలు లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని బ్రిటన్ దేశం బుధవారం రోజు అడ్వైజరీ జారీ చేసింది.