Nepal Earthquake : నేపాల్లో భూకంపం.. 128 మంది మృతి, వందలాది మందికి గాయాలు
Nepal Earthquake : నేపాల్ వాయవ్య ప్రాంతంలోని జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది.
- By Pasha Published Date - 06:50 AM, Sat - 4 November 23

Nepal Earthquake : నేపాల్ వాయవ్య ప్రాంతంలోని జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయి దాదాపు 128 మందికిపైగా చనిపోయారు. వందలాది మంది గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. భూకంపం తీవ్రత 5.6గా ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. నేపాల్ రాజధాని ఖాట్మండుకు ఈశాన్యంగా 250 మైళ్ల దూరంలో ఉన్న జాజర్కోట్లో 11 మైళ్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేపాల్ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధనా కేంద్రం తెలిపింది. ఇక నేపాల్కు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశ రాజధాని న్యూఢిల్లీలోనూ భూకంపం వచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
నేపాల్లో సంభవించిన భూకంపం కారణంగా ఒక్క రుకుమ్ జిల్లాలోనే ఇళ్లు కూలిపోయి దాదాపు 30 మంది మరణించారు. మరో 30 మంది గాయపడగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. జాజర్కోట్ జిల్లాలో మరో 30 మంది మరణించారు. కూలిపోయిన ఇళ్ల శిథిలాల కింది నుంచి డెడ్ బాడీస్ను, గాయపడిన వారిని బయటకు తీసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. భూప్రకంపనల కారణంగా నేపాల్లోని కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో దిగువ భాగాన ఉన్న ఇళ్లు నేలమట్టమయ్యాయి. 2015లో నేపాల్లో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించి దాదాపు 9,000 మంది మరణించారు. అప్పట్లో 10 లక్షల ఇళ్లు(Nepal Earthquake) దెబ్బతిన్నాయి.