B N Reddy : ప్రేక్షకుల ముందు తలెత్తుకోలేక సిగ్గుతో బాధపడ్డ.. మొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బిఎన్ రెడ్డి..
తెలుగు పరిశ్రమకి ఇంతటి గౌరవం తెచ్చిపెట్టిన బిఎన్ రెడ్డి.. ఒక సినిమా విషయంలో ప్రేక్షకుల దగ్గర తన గౌరవం పోగుట్టుకొని సిగ్గుతో తల దించుకొని బాధ పడ్డారట.
- Author : News Desk
Date : 04-11-2023 - 6:33 IST
Published By : Hashtagu Telugu Desk
బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి(B N Reddy).. స్క్రీన్ పై బిఎన్ రెడ్డిగా అందరికి సుపరిచితులు అయిన ఈ దర్శకుడు.. తెలుగు పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా సేవలు అందించారు. ఈయన దర్శకత్వం వహించింది కేవలం 11 సినిమాలే అయినా.. వాటితో తెలుగు తెరపై ఆయన వేసిన ముద్ర చెరిగిపోలేనిది. భానుమతి, ఎన్టీఆర్ల ‘మల్లేశ్వరి’ వంటి కల్ట్ క్లాసిక్ మూవీని డైరెక్ట్ చేసిందే ఈ దర్శకుడే.
పదకొండు సినిమాల్లో మూడు సినిమాలకు నేషనల్ అవార్డు(National Award) తెచ్చిపెట్టిన ఈ దర్శకుడు.. టాలీవుడ్ నుంచి మొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(Dada Saheb Phalke Award) అందుకున్న వ్యక్తిగా కూడా చరిత్ర సృష్టించారు. తెలుగు పరిశ్రమకి ఇంతటి గౌరవం తెచ్చిపెట్టిన బిఎన్ రెడ్డి.. ఒక సినిమా విషయంలో ప్రేక్షకుల దగ్గర తన గౌరవం పోగుట్టుకొని సిగ్గుతో తల దించుకొని బాధ పడ్డారట.
బిఎన్ రెడ్డి నుంచి ఆడియన్స్ ముందుకు బంగారు పాప, సుమంగళి, దేవత, భాగ్యరేఖ, మల్లేశ్వరి.. ఇలా కుటుంబకథా చిత్రాలు వచ్చి మంచి ఆదరణ సంపాదించుకున్నాయి. ప్రేక్షకుల్లో బిఎన్ రెడ్డి సినిమాలు అంటే గుండెకు హత్తుకునేలా ఉంటాయనే భావన ఉండేది. అయితే 1959లో తన జోనర్ దాటి వచ్చి బిఎన్ రెడ్డి, ఎన్టీఆర్ తో ‘రాజ మకుటం’ అనే పౌరాణిక నేపథ్య సినిమా చేశారు.
ఇక ఆ మూవీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందని తెలుసుకోవడానికి.. విజయవాడ వాహినీ సంస్థ బ్రాంచి మేనేజర్ సుబ్రహ్మణ్యం అలియాస్ దర్శకుడు కె.విశ్వనాథ్ తండ్రిని తీసుకోని ఏలూరులోని ఒక థియేటర్ కి వెళ్లారట. ముందుగా బాల్కనీలో కూర్చొని ఆడియన్స్ రియాక్షన్ గమనించిన రెడ్డి.. కొద్దిసేపటికి బాల్కనీ దిగి బెంచ్ క్లాస్ కు వెళ్లారు. అక్కడి ఆడియన్స్ రియాక్షన్ గమనిస్తున్న సమయంలో పోరాట సన్నివేశం రాగానే ఒక ప్రేక్షకుడు అన్న మాట రెడ్డిని బాగా నొప్పించింది.
అతడు ఏమన్నాడంటే.. “బిఎన్ రెడ్డికి ఇదేం పోయేకాలం. ఈయన కూడా ఇలాంటి సినిమాలు మొదలు పెట్టాడు?” అని అన్నాడట. అది విన్న బిఎన్ రెడ్డి తలెత్తుకోలేక సిగ్గుతో హాల్ లో నుంచి బయటకు వచ్చారట. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న పేరు అంతా ఒక సినిమాతో పోగుట్టుకున్నాను అని బాధతో.. విజయనగరం వరకు వెళ్లాల్సిన టూర్ ని మానుకొని వెంటనే మద్రాసు మెయిల్ ఎక్కారట. మల్లి పౌరాణికం సినిమాల జోలికి పోలేదు బిఎన్ రెడ్డి.
Also Read : Krishnam Vande Jagadgurum : మూడు కథలను కలిపి ‘కృష్ణం వందే జగద్గురుమ్’ తీసిన క్రిష్..