Supreme Court : చిన్నారుల అక్రమ రవాణా కేసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఏ ఆస్పత్రిలోనైనా చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్లు తేలితే లైసెన్స్ రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
- By Latha Suma Published Date - 04:28 PM, Tue - 15 April 25

Supreme Court : చిన్నారుల అక్రమ రవాణా కేసులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరు, అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేరాలను నిరోధించేందుకు ప్రభుత్వానికి కఠిన మార్గదర్శకాలు ఇచ్చింది. ఏ ఆస్పత్రిలోనైనా చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్లు తేలితే లైసెన్స్ రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ రవాణా పెండింగ్ కేసులకు సంబంధించి విచారణ ఎలా కొనసాగుతోందో తెలియజేయాలని దేశవ్యాప్తంగా హైకోర్టులను జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. నిందితుడి బెయిల్ రద్దు చేసింది. ఇలాంటి కేసులకు సంబంధించిన విచారణను 6 నెలల లోపు పూర్తిచేయాలి. రోజూవారీ విచారణను కూడా నిర్వహించాలి అని ఆదేశాలు జారీ చేసింది.
Read Also: CM Revanth : మంత్రి పదవుల అంశంలో నోరుపారేసుకుంటే.. ఊరుకోం : సీఎం రేవంత్
కాగా, ఇటీవల ఉత్తరప్రదేశ్ ఒక ఆస్పత్రిలో నవజాత శిశువు అపహరించ పడ్డాడు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఆ శిశువును దుండగుడు విక్రయించాడు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించిన దంపతులకు నిరాశే మిగిలింది. కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ.. బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం విచారించింది. చిన్నారుల అక్రమరవాణా కేసులపై యూపీ ప్రభుత్వ తీరు, నిందితుడికి బెయిల్ మంజూరుచేసిన అలహాబాద్ హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఇకపై ఏ ఆస్పత్రిలోనైనా అక్రమ రవాణా జరిగినట్లు తేలితే లైసెన్స్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు సంబంధిత అధికారులకు ఆదేశించింది. కుమారుడిని పొందేందుకు ఆశపడిన నిందితుడు.. రూ.4 లక్షలకు చిన్నారిని పొందాడు. ఒకవేళ బిడ్డ కావాలని అనుకుంటే అక్రమ రవాణా చేసేవారిని సంప్రదించాల్సింది కాదు. ఆ చిన్నారిని దొంగతనం చేసి తనకు అందించారనే విషయం నిందితుడికి బాగా తెలుసు. ఇలాంటివారు సమాజానికి ముప్పు. నిందితులు ప్రతి వారం పోలీస్ స్టేషన్లో తప్పకుండా హాజరుకావాలి. కానీ, దీనిపై దృష్టిసారించకుండా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Read Also: AP Cabinet : ఎస్సీవర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు ఏపీ మంత్రివర్గం ఆమోదం