Medical Education : హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్య : విద్యార్థులకు ప్రధాని హామీ
దేశంలో ఎయిమ్స్ ఆసుపత్రులను 24 కు పెంచామని గుర్తు చేశారు. దేశంలో 1.5 లక్షలకు పైగా ఉన్న 'ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు' బడుగు బలహీనవర్గాలకు మెరుగైన సేవలందిస్తున్నాయని తెలిపారు.
- By Latha Suma Published Date - 02:31 PM, Wed - 13 November 24

PM Modi : ప్రధాని నరేంద్రమోడీ ఈరోజు బిహార్ లోని దర్భంగాలో ఎయిమ్స్కు ప్రధాని శంకుస్థాపన చేసి, రూ.12,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. బిహార్లో నీతీశ్ కుమార్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రధాని కొనియాడారు. ఆటవిక రాజ్యంగా ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు కేవలం తప్పుడు వాగ్దానాలు మాత్రమే చేశాయని.. కానీ రాష్ట్రంలో నీతీశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. ముందు ముందు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం భారతదేశంలో నీట్ పరీక్ష కేవలం ఇంగ్లీషు మీడియంలోనే ఉండటంతో కొంత మంది విద్యార్థులు చదవలేకపోతున్నారు. కేవలం ఇంగ్లీషు మీద పట్టు ఉన్న విద్యార్థులు మాత్రమే వైద్య విద్య పై శ్రద్ధ పెడుతున్నారు. అయితే త్వరలోనే హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్ష మెడికల్ సీట్లను జోడించామని..రానున్న ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తామని ఈ మేరకు వైద్య విద్యార్థులకు ప్రధాని హామీ ఇచ్చారు. దేశంలో ఎయిమ్స్ ఆసుపత్రులను 24 కు పెంచామని గుర్తు చేశారు. దేశంలో 1.5 లక్షలకు పైగా ఉన్న ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు’ బడుగు బలహీనవర్గాలకు మెరుగైన సేవలందిస్తున్నాయని తెలిపారు. దేశంలో దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజలు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారని ప్రధాని మోడీ తెలిపారు.