Janasena : ‘జయకేతనం’..సభా వేదికపై 250 మంది కూర్చునేలా ఏర్పాట్లు
సభా ప్రాంగణంలో 15 ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టనున్నారు. 1700 మంది పోలీసులను ఈ సభ బందోబస్తుకు కేటాయించారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించారు.
- By Latha Suma Published Date - 02:35 PM, Fri - 14 March 25

Janasena : కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నేతలు తరలివస్తున్నారు. ‘జయకేతనం’ పేరిట నిర్వహిస్తున్న ఈ సభా వేదికపై 250 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. కాకినాడ – పిఠాపురం – కత్తిపూడి మార్గంలో రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సభా ప్రాంగణంలో 15 ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టనున్నారు. 1700 మంది పోలీసులను ఈ సభ బందోబస్తుకు కేటాయించారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించారు.
Read Also: Nara Lokesh : మంగళగిరి అభివృద్ధికి నిత్యం కృషి చేస్తా – మంత్రి నారా లోకేశ్
గత 12 రోజులుగా 470 మంది సాంకేతిక నిపుణులతో సభా వేదిక ప్రాంగణంలో ఆడియో, వీడియో వ్యవస్థను ఏర్పాటు చేశారు. కిలోమీటర్ దూరంలో ఉన్న వారికీ వీఐపీ గ్యాలరీలో ఉన్న అనుభూతి కలిగేలా ఆడియో సిస్టమ్స్ సిద్ధమయ్యాయి. 23 ఎల్ఈడీ వాల్స్తో పాటు ఇటలీకి చెందిన లైనర్ రేస్తో నిర్మాణం చేపట్టారు. ఎన్ఆర్ఐ ప్రశాంత్ కొల్లిపర ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి సభలకు దీటుగా వేదిక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, జార్జి బుష్ సభలతో పాటు మనదేశంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు సభలకు ఏర్పాట్లు చేసిన అనుభవం ప్రశాంత్కు ఉంది.
ఇక, జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి 3.45 గంటలకు చిత్రాడలోని ప్రాంగణానికి హెలికాప్టర్లో చేరుకుంటారు. తొలుత తెలుగుభాష ప్రాధాన్యం, పార్టీ విశేషాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. చివర్లో పవన్కల్యాణ్ కూటమి ప్రభుత్వ ప్రగతిపథం, పార్టీ భవిష్యత్తు కార్యాచరణను వివరించనున్నారు. ఈ సభ మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10 గంటల వరకు సాగే అవకాశం ఉంది.