Byjus Vacate : అద్దె కట్టలేక అతిపెద్ద ఆఫీస్ ఖాళీ చేసిన ‘బైజూస్’
Byjus Vacate : దేశంలోని ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ ‘బైజూస్’ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది.
- By Pasha Published Date - 02:44 PM, Tue - 20 February 24

Byjus Vacate : దేశంలోని ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ ‘బైజూస్’ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. చివరకు ఆఫీసుల అద్దెలు కూడా కట్టలేని స్థితికి ‘బైజూస్’ చేరుకుంది. ఈ కంపెనీ ఇప్పటికే పలు ఆఫీసుల్ని ఖాళీ చేసింది. తాజాగా బెంగళూరులో మరో పెద్ద ఆఫీసును ఖాళీ చేసేసింది. నగరంలోని ప్రెస్టైజ్ టెక్ పార్కులో ఉన్న 4 లక్షల చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న ఆఫీస్ స్పేస్ను వదిలేసింది. అద్దె కట్టలేక బైజూస్ ఇలా చేసింది. కంపెనీ నిర్వహణకు సరిపడా నిధులు లేక.. ఆఫీసుల సంఖ్యను ఈవిధంగా తగ్గిస్తోంది. ప్రెస్టైజ్ టెక్ పార్కులో ఉన్న బైజూస్ ఆఫీసు బిల్డింగ్ రెంటల్ అగ్రిమెంట్ను ఈ ఏడాది ఆరంభంలోనే రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు నెలలుగా అద్దె చెల్లించకుండా.. ముందే చెల్లించిన డిపాజిట్తో సర్దుబాటు చేసుకున్నట్లు సమాచారం. దేశంలోని మరికొన్ని చోట్ల కూడా బైజూస్ సంస్థ(Byjus Vacate) ఇదేవిధంగా అద్దె కార్యాలయాలను ఖాళీ చేస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
బెంగళూరులో ప్రెస్టైజ్ గ్రూప్తో మూడున్నర సంవత్సరాల కిందట ఆఫీస్ స్పేస్ కోసం బైజూస్ ఒప్పందం కుదుర్చుకుంది. రెంటల్ అగ్రిమెంట్లో భాగంగా నెలకు రూ. 4 కోట్లు అద్దె కట్టాలి. ప్రస్తుతం కంపెనీ అప్పుల ఊబిలో ఉంది. దీంతో అంత భారీ అప్పులు కట్టడం కంపెనీకి పెద్ద సవాలుగా మారింది. బెంగళూరులో ఉన్న కల్యాణి టెక్ పార్కులోని 5 లక్షల చదరపు అడుగుల మేర విస్తరించి ఉన్న ఓ ఆఫీసు అద్దెను కూడా బైజూస్ గత 10 నెలలుగా చెల్లించడం లేదట. దీంతో బైజూస్కు కల్యాణి డెవలపర్స్ లీగల్ నోటీసులు పంపారు. 2025 మార్చితో అక్కడి ఆఫీసు అగ్రిమెంట్ ముగుస్తుంది. ముందస్తు డిపాజిట్తో 7 నెలల అద్దెను బైజూస్ సర్దుబాటు చేసుకుంటుందని సమాచారం.
Also Read : Marathas Reservation : మరాఠాలకు10 శాతం రిజర్వేషన్.. బిల్లుకు కేబినెట్ ఆమోదం
‘బైజూస్’ సంక్షోభంపై సమాచారం ..
- బైజూస్ ఎడ్టెక్ కంపెనీని బైజూస్ రవీంద్రన్, దివ్యా గోకుల్నాథ్ కలిసి 2011లో ప్రారంభించారు.
- కరోనా సమయంలో దీనికి మంచి వ్యాపారం జరిగింది. ఆ తర్వాత ఆదరణ తగ్గుతూ వచ్చింది.
- విదేశాల్లో బ్రాంచులు తెరవడంతో కంపెనీ అప్పులు పెరిగాయి.
- అప్పులను తిరిగి కట్టలేక కంపెనీ ఇబ్బందులు పడుతోంది.
- విదేశీ నిధులకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలు బైజూస్ యాజమాన్యంపై వచ్చాయి.
- ఇటీవలకాలంలో బైజూస్ ఎంతోమంది ఉద్యోగులకు తీసేసింది. ఉద్యోగులకు జీతాలు చెల్లింపు కూడా బాగా లేట్ చేస్తూ వస్తోంది.
- బైజూస్ తన ఉద్యోగుల పీఎఫ్ బకాయిలు కూడా చెల్లించనట్లు తెలిసింది.
- ఈ సంక్షోభం నేపథ్యంలో బైజూస్ కంపెనీ బోర్డు నుంచి వ్యవస్థాపకుడు రవీంద్రన్నే తప్పించేందుకు ఇన్వెస్టర్లు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.