YS Sharmila : షర్మిల గమ్యం ఎటు?
కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కలిసి మంతనాలు జరపడం, తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కూడా సిద్ధపడటం లాంటి వార్తలు వెలుగు చూశాయి
- By Sudheer Published Date - 07:29 PM, Thu - 2 November 23
డా. ప్రసాదమూర్తి
ఎన్నికలంటే రాజకీయ నాయకుల జయాపజయాలు అనుకుంటాం. కానీ ఎన్నికలు అనేక పాఠాలు చెబుతాయి. ఆ పాఠాలు కేవలం రాజకీయ నాయకులకే కాదు ప్రజలకు కూడా వర్తిస్తాయి. తాము గెలవడం ఎదుటివారిని ఓడించడం ఎన్నికల్లో సాధారణ లక్ష్యం. కానీ తాము ఓడినా, ప్రత్యర్థి మాత్రం గెలవకూడదనేది మరో సూత్రం. ఇంకొంచెం ముందుకు వెళ్లి తేరిపార చూస్తే తమ జయాపజయాల కంటే తాము ప్రత్యర్థిగా భావించే వ్యక్తి గాని పార్టీ గాని విజయం సాధించకూడదు అనే లక్ష్యంతో కొందరు ముందుకు కదులుతారు. అంటే తమ ప్రయోజనాల కంటే ఎదుటివారి ప్రయోజనాలను దెబ్బతీయటమే ఇక్కడ ప్రధాన లక్ష్యం. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే ప్రత్యర్థి ప్రయోజనాలను దెబ్బతీయటమే తమ ప్రయోజనం అనుకోవడం. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల రణరంగంలో ప్రధాన ప్రత్యర్థుల హోరాహోరీ పోరు జోరుగా సాగుతున్న తరుణంలో, వైఎస్ షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పరాజయమే తన గమ్యంగా మార్చుకున్నట్టు కనిపిస్తున్న కారణంగానే ఇదంతా ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) బిడ్డగా, తెలంగాణ కోడలుగా తెలంగాణ మట్టితో తన కుటుంబానికి ఉన్న తరాల అనుబంధాన్ని గుర్తుచేస్తూ వైఎస్ షర్మిల వైయస్సార్ తెలంగాణ పార్టీ (YSR Telangana Party)ని ఏర్పాటు చేసి రాజకీయ రంగంలోకి దూకారు. తన తండ్రి తెలంగాణ ప్రజలతో మమేకమై వారి సంక్షేమం కోసం చేపట్టిన ఎన్నో పథకాలను, తెలంగాణ అభివృద్ధిలో తన తండ్రి భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ తెలంగాణలో కొనసాగుతున్న దొరల పాలన అంతమొందించి వైయస్సార్ రాజకీయ ప్రాభావాన్ని తెలంగాణలో పునరుద్ధరిస్తానని షర్మిల చెప్పుకొచ్చారు. దీని ద్వారా ఆమె రాజకీయ ఉద్దేశం అధికార బీఆర్ఎస్ పార్టీని గద్ద దింపడమే కావాలి. అందుకు ఆమె పార్టీకి అంత శక్తి సామర్థ్యాలు లేవని అర్థమైంది. అంటే అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే ఆ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్న మరో పార్టీతో జత కట్టాల్సిన రాజకీయ ఆవశ్యకత షర్మిలకు ఉన్నది. ఇలా చూసినప్పుడు ఆమె తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఈ ఎన్నికల బరిలో దూకాల్సి ఉంది. ఇదే వ్యూహంతో ఆమె ముందుకు కదిలినట్టు కొంతకాలం అనిపించింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కలిసి మంతనాలు జరపడం, తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కూడా సిద్ధపడటం లాంటి వార్తలు వెలుగు చూశాయి. ఇక షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనమై అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS)కి ఎన్నికల్లో చుక్కలు చూపించే సంకేతాలు స్పష్టంగా ప్రజలకు అందాయి. కానీ తెర వెనక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. సీట్ల బేరసారాలు, షర్మిల డిమాండ్ చేసిన నియోజకవర్గాలు.. మొత్తం అంతా బెడిసికొట్టినట్టుగా ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీ షర్మిలతో దోస్తీ కంటే, వైరమే మేలని మిన్నకుండిపోయింది. ఇక అప్పుడు షర్మిల మరొక ప్రత్యర్థి పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి ఉంది. కానీ వైయస్ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్ర ప్రకారం బిజెపితో పొత్తు ఏ లెక్కల ప్రకారం చూసినా వీలయ్యే పని కాదు. కడకు షర్మిల ఒంటరిగానే ఎన్నికల్లో దిగాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్నికలలో బేరసారాలు, సంప్రదింపులు, చర్చలు బెడిసి కొట్టడం, మరో గత్యంతరం లేక ఎవరి జెండా వారు పట్టుకొని ఒంటరి పోరాటానికి సిద్ధపడటం షరా మామూలే. అలాగే షర్మిల ఒంటరిగా తమ పార్టీ అభ్యర్థులను అన్ని స్థానాల్లోనూ నిలబెడతానని ముందు ప్రకటించారు. అందరూ ఆమె ఏం నిర్ణయం తీసుకుంటారు.. ఎటు నడుస్తారు.. అసలు ఆమె గమ్యం ఎటు అనే విషయం మీద ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద షర్మిల ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది. అది ఏమంటే తన విజయం కంటే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం కాకుండా అడ్డుకున్న శక్తుల పరాజయమే ఆమెకు ముఖ్యమైంది. అందుకే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బాగా బలం ఉన్నచోట్ల తమ పార్టీ అభ్యర్థులను నిలపాలని ఆమె నిర్ణయించుకున్నారని వినికిడి.
తాను స్వయంగా పాలేరు నుంచి పోటీకి దిగుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే తాను ఆశించిన రెండు మూడు సీట్లు కోల్పోయిన కారణంగా, తాను ఏ పార్టీ పరాజయాన్ని చవి చూడాలనుకున్నదో ఆ పార్టీకి గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ ఓటమినే తన ప్రధాన లక్ష్యంగా చేసుకున్నట్లు ఇప్పుడు కనిపిస్తోంది. జాతీయస్థాయిలో దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణ ఎన్నికల్లో జియాపజయాలు కీలకమైనవే కావచ్చు కానీ, ఇక్కడి అపజయంతో ఆ పార్టీ చరిత్ర ముగిసిపోదు.
ఈ ఎన్నికలలో తాను తీసుకున్న నిర్ణయం మాత్రం షర్మిల భవిష్యత్తుకు అత్యంత కీలకం. గమ్యం తెలియకుండా అడుగులు కదిపితే ఆ ప్రయాణం, ఆ ప్రయాస అంతా వృధా కావాల్సిందే. తీరం ఎటో తెలిసిన వ్యక్తి ఎంత కష్టమైనా అటువైపు ఈదడానికి ప్రయత్నిస్తాడు. కానీ తీరం తెలియకుండా ఈత సాగిస్తూ ఉన్న మనిషి సముద్రం మధ్యలోనే గింగిరాలు కొడుతూ ఉంటాడు. షర్మిల పరిస్థితి అలాంటి అగమ్య గోచరంగా కనిపిస్తోంది. బిజెపి నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి లాంటి ప్రముఖ నాయకులు కేసీఆర్ పరాజయాన్ని మాత్రమే తాము కోరుకుంటున్నామని, అందుకే కాంగ్రెస్ లోకి వచ్చామని స్పష్టంగా చెబుతున్నారు.
అలాంటి స్పష్టత షర్మిలలో కనిపించకపోవడం ఆమె రాజకీయ భవితవ్యాన్నే అయోమయ అంధకారంలో పడేసింది. కీలక సమయంలో మనం తీసుకునే నిర్ణయాలే మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. మరి తన గమ్యాన్ని కేవలం కాంగ్రెస్ పరాజయంగానే షర్మిల భావిస్తున్నారా, లేక తన రాజకీయ భవిష్యత్తుకు అనువైనదిగా ఆ గమ్యాన్ని మలుచుకుంటున్నారా అనే విషయం ఆమెనే తేల్చుకోవాలి. ఏమైనా రాజకీయాల్లో ఒక తప్పటడుగు కోటి కోటి వెనకడుగులకు సాటి కాగలదు.
Read Also : BRS Minister: గ్రామ గ్రామాన గంగులకు ఏకగ్రీవ తీర్మానాలు
Related News
Phone Tapping Case; ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు.. సంచలన విషయాలు వెలుగులోకి
ట్యాపింగ్ లో కేసులో తొలిసారి మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును ప్రస్తావించారు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు.కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకే తామంతా కలిసి పని చేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలంలో చెప్పినట్టు సమాచారం