KCR Strategies : ఊహకందని కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తాయా.. వికటిస్తాయా?
వ్యూహాలు, వేసే ఎత్తులు ప్రత్యర్థుల ఊహలకు కూడా అందవు. ఇది నిజమే. కేసీఆర్ (KCR) రాజకీయ ప్రస్థానం తెలంగాణ ఉద్యమంతో మలుపు తిరిగింది.
- By Hashtag U Published Date - 10:38 AM, Sat - 4 November 23
By: డా. ప్రసాదమూర్తి
Will KCR Strategies Work? : తన వ్యతిరేకులు ఎంతటి వారినైనా దద్దమ్మలు.. సన్నాసులు అని తిట్టే కల్వకుంట్ల చంద్రశేఖర రావు తనను తాను పరిపక్వ రాజకీయ నేతగా, పరిపూర్ణ మేధావిగా భావిస్తారు. అందుకే ఆయన రచించే వ్యూహాలు, వేసే ఎత్తులు ప్రత్యర్థుల ఊహలకు కూడా అందవు. ఇది నిజమే. కేసీఆర్ (KCR) రాజకీయ ప్రస్థానం తెలంగాణ ఉద్యమంతో మలుపు తిరిగింది. తెలంగాణ సెంటిమెంట్, ఆయన కమిట్మెంట్ కలిసివచ్చి రెండు దఫాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే మహాభాగ్యం ఆయనకు దక్కింది. అందలం అందినప్పుడు ఏం మాట్లాడినా అది చెల్లిపోతుంది. పవర్ లో ఉన్నవారు ప్రత్యర్థులను ఎలాంటి విమర్శల బాణాలు వేసి, అపహాస్యాల అస్త్రాలు వదిలి ఇరకాటంలో పెట్టినా అది అధికారం వారికి ఇచ్చిన ఒక అవకాశం. కాలం ఎప్పుడూ ఒక మాదిరిగా ఉండదు.
మహామహులు, మహితాత్ములు అనుకున్న వారే కాలం కొట్టిన దెబ్బకు గింగిరాలు తిరిగిన చారిత్రక ఉదాహరణలు కోకొల్లలు. రెండుసార్లు తెలంగాణను పరిపాలించిన కేసీఆర్ (KCR) మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని ఇప్పుడు చూస్తున్నారు. కానీ రెండుసార్లు ఆయన పరిపాలనను చూసిన ప్రజలు మూడోసారి ఆ అవకాశాన్ని ఆయనకిస్తారా, మరొకరికి ఇస్తారా అనేది ప్రస్తుతం కొనసాగుతున్న అత్యంత ఉత్కంఠ భరిత సన్నివేశం. ఈ సందర్భంలో కేసీఆర్ ఏం మాట్లాడుతున్నారు.. ఏ వ్యూహాన్ని పన్నుతున్నారు అనేది రాజకీయ నాయకులే కాదు, ప్రజలు కూడా దీక్షగానే పరిశీలిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మెడకు చుట్టుకున్న మేడిగడ్డ వ్యవహారం:
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కూలిపోవడం ఈ ఎన్నికలలో అతిపెద్ద రాజకీయ అంశంగా మారిపోయింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. మరోవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటీ నిపుణుల బృందం కూడా నివేదికను బయటపెట్టింది. ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు, నిర్వహణ లోపాలు ఉన్నట్టు స్పష్టంగా ఈ బృందం నివేదికలో బయటపెట్టింది. ఇప్పటికే ఇది ఒక ప్రజాధనాన్ని అత్యధికంగా వృధా చేస్తున్న పనికిరాని ప్రాజెక్టు అని బిజెపి నాయకులతో సహా అందరూ విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో పరిణతి చెందిన రాజకీయ నేతగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ (KCR) సకాలంలో స్పందించి సముచిత చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ ప్రాజెక్టులో కుట్ర కోణం ఉందని కొన్నిసార్లు చెప్పడం, ప్రాజెక్టు ఘనతను మాటిమాటికీ కీర్తించడం, నిర్మాణ లోపాలు లేవని పదేపదే తమను తాము సమర్ధించుకోవడం కేసిఆర్ తో సహా అందరూ సాగిస్తూనే ఉన్నారు.
అంతేకాదు కేంద్ర బృందం నివేదికను కూడా తప్పుపడుతున్నారు. దీని వెనక రాజకీయ ఉద్దేశాలు ఉన్నట్లు అధికార పార్టీ నాయకులు వాదిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాము చెప్పింది ఏమిటి, జరుగుతున్నది ఏమిటి తలెత్తిన లోపాలు ఏమిటి, ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ద్వారా అందిన లాభాలు ఏమిటి.. ఇలాంటి విషయాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది పోయి కేసిఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ నాయకులంతా ప్రతిపక్షాల మీద కాలు దువ్వడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యవహారం అంతా ఇప్పుడు కేసీఆర్ మెడకు చుట్టుకుంటుంది. మేడిగడ్డ విషయంలో గానీ అన్నారం బ్యారేజీ లీక్ విషయంలో గానీ బాధ్యత గల ప్రభుత్వ ప్రతినిధులుగా బీఆర్ఎస్ నాయకులు తగిన రీతిలో స్పందించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పైగా మేడిగడ్డపై స్పందించడం పోయి, ఏకంగా నాగార్జునసాగర్ నిర్మాణమే సరైన చోట జరగలేదని అక్కడ ఏదో మోసం జరిగిందని కేసీఆర్ అన్నారు. అందరూ ఈ మాటలకు విస్తు పోయారు. ఏ విషయం మీద కేసీఆర్ ఎలా స్పందిస్తున్నారో.. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక జనం తల పట్టుకుంటున్నారు. వీలు చూసి విపక్షాన్ని దెబ్బతీసే చతురత గల కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఇలా తడబడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు.
Also Read: Telangana Elections : దేశ రాజకీయాల్లోనే కీలకంగా మారిన తెలంగాణ
సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డు:
కీలెరిగి వాత పెట్టడం కేసీఆర్ కు మాత్రమే తెలుసు అని అందరూ అనుకుంటారు. ఒక్క మాటతో దృశ్యాన్ని మార్చగల మాంత్రికుడు కేసీఆర్ అని కూడా అంటారు. కానీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆయన కుమారుడు కేటీఆర్, హరీష్ రావు తదితరులు వ్యవహరించిన తీరు తెలుగుదేశం పార్టీ అభిమానులకు తీవ్ర మనస్థాపం కలిగించింది. అయితే అక్కడ జరిగిన పొరపాటును చక్కదిద్దుకోవడానికి, టిడిపి తెలంగాణలో పోటీ చేయడం లేదు కాబట్టి ఆ ఓటు బ్యాంకును తమ వైపు మరల్చుకోవడానికి కేసీఆర్ సత్తుపల్లి సభలో ‘ఆంధ్రాలో సింగిల్ రోడ్డు, తెలంగాణలో డబల్ రోడ్డు’ అంటూ ఒక పరిహాస పూర్వక ప్రచారాస్త్రాన్ని వదిలారు. అంతటి పరిణతి గల నాయకుడు కూడా ఈ విషయంలో బోల్తా పడినట్టుగా కనిపిస్తోంది. ఈ మాట ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం అభిమానుల మనసు కేసీఆర్ ఎంత చూరగొన్నారో గానీ, వైయస్సార్సీపి అభిమానుల వ్యతిరేకతను మాత్రం ఎక్కువగా కూడగట్టుకున్నారు. ఈ విషయంలో కూడా కేసిఆర్ వ్యూహం బెడిసి కొట్టింది.
ఓటమి భయం పట్టుకుందా?
ఈమధ్య కేసీఆర్ మాట్లాడుతున్న మాటల్లో ఆయనకు ఓటమి భయం పట్టుకుందా? ఈసారి ఎన్నికల్లో తనకు పరాజయం తప్పదని ఆయనకు అర్థమైందా? అనే సందేహం మనకు కలుగుతుంది. మూడోసారి తప్పనిసరిగా తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమాతో ఉన్నవారు మాట్లాడకూడని ఒక మాట ఆయన అన్నారు. ఈసారి ఎన్నికల్లో తాను ఓడిపోతే హాయిగా విశ్రాంతి తీసుకుంటానని, తనకేమీ నష్టం లేదని ప్రజలే నష్టపోతారని కేసీఆర్ హెచ్చరించారు. ఇలాంటి మాటలు కేసీఆర్ నోట వినడం సగటు ఓటరు హృదయంలో లక్ష అనుమానాలకు తావిస్తుంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు కూడా ఇలాగే అన్నారు. తాను ఓడిపోతే మనవడితో హాయిగా ఆడుకుంటానని, నష్టపోయేది ప్రజలేనని అన్నారు. కానీ ఆయన ఓడిపోయి మనవడితో ఆడుకుంటూ విశ్రాంతిలో లేడు.
ప్రజలు నష్టపోయారో లేదో వచ్చే ఎన్నికల్లో వాళ్లే చెప్తారు. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడా సెంటిమెంట్ మాట వినిపించడం లేదు. తన త్యాగం మాట కూడా ప్రజల ముందు వర్కవుట్ అయ్యేలా లేదు. తనకు తిరుగులేదని భావించే కేసీఆర్ మాటలు ఫలిస్తాయా.. వికటిస్తాయా కాలమే చెప్పాలి. అందుకే ఆయన యాగాలు యజ్ఞాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. కనీసం యజ్ఞయాగాల వ్యూహమైనా ఫలిస్తుందో లేదో చూడాలి.
Also Read: UP : దళిత మహిళను అత్యాచారం చేసి..తర్వాత ముక్కలు ముక్కలుగా నరికేశారు
Related News
TS : ఇంకా రాష్ట్రంలో యుద్ధం మిగిలే ఉంది: మాజీ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
Former CM KCR: రాజకీయ, సామజిక అంశాల్లో వచ్చిన మార్పులు, రాష్ట్ర ప్రగతి తదితర అంశాలపై తెలంగాణ ఉద్యమకారుడు(Telangana activist) గోసుల శ్రీనివాస్ యాదవ్ ఎడిటోరియల్ వ్యాసాలతో రూపకల్పన చేసిన ‘సన్ ఆఫ్ ద సాయిత్’ (భూమిపుత్రుడు) పుస్తకాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు(శుక్రవారం) ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత గోసుల శ్రీనివాస్ యాదవ్ను కేసీఆర్ ప్రత్యే