Revanth Reddy : రేవంత్ ఫెయిల్యూర్ స్టోరీ
ఐదో తేదీన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఆ రోజున ఇటీవల జరిగిన పరిణామాలపై కమిటీ రివ్యూ చేయనుంది. ఆ సమావేశంలో తేల్చుకుంటానంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వెల్లడించాడు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న చిన్నారెడ్డి వాలకంపై మండిపడుతున్నాడు.
- By CS Rao Published Date - 04:45 PM, Mon - 3 January 22
ఐదో తేదీన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఆ రోజున ఇటీవల జరిగిన పరిణామాలపై కమిటీ రివ్యూ చేయనుంది. ఆ సమావేశంలో తేల్చుకుంటానంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వెల్లడించాడు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న చిన్నారెడ్డి వాలకంపై మండిపడుతున్నాడు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తాడోపేడో ఆ రోజు తేల్చుకోవడానికి సిద్ధం అయ్యాడు. కానీ, ఆరోజున రేవంత్ కమిటీ సమావేశానికి హాజరయ్యే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆయనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందట. అంటే..ఆ రోజున సమావేశానికి రాలేనని ముందుగానే చెప్పేశాడన్నమాట.కేసీఆర్ సర్కార్ మీద ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనేక రూపాల్లో పోరాటం చేయాలని ప్రయత్నం చేశాడు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ వద్ద రైతులతో నిరసన సభను నిర్వహించాలని భావించాడు. కానీ, ఆ రోజున ఆయన్ను పోలీసులు. గృహనిర్బంధం చేశారు. ఆయన ఇంటి చుట్టూ మీడియా మోహరించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు కోణాల నుంచి ప్రచారం జరిగింది.
మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించడానికి రేవంత్ గత వారం షెడ్యూల్ చేసుకున్నాడు. జోనల్ వ్యవస్థ రూపంలో వచ్చిన జీవోలతో చనిపోయిన టీచర్ ఫ్యామిలీని ఆ రోజున పరామర్శించాలని అనుకున్నాడు. ఆ మేరకు ముందు రోజున ప్రకటించాడు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మరోసారి గృహనిర్బంధం చేశారు. వరుసగా రెండు రోజులు ఆయన్ను ఇంటిలోనే పోలీసులు ఉంచారు. దీంతో సహజంగా మీడియా రేవంత్ వైపు మళ్లింది. విస్తృతంగా ప్రచారాన్ని ఇచ్చింది. గతంలో ఛలో ప్రగతిభవన్ పిలుపులో భాగంగా పోలీసుల కళ్లుగప్పి పరుగెత్తిన విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి సంఘటన ఉంటుందని మీడియా ఆయన ఇంటి వద్ద మోహరించింది. అనూహ్యమైన ప్రచారం జరిగింది.రెండు రోజుల పాటు మీడియా ఇచ్చిన ప్రచారంతో మరోసారి రేవంత్ హైలెట్ అయ్యాడు. కానీ, కాంగ్రెస్ పార్టీకి మాత్రం మైలేజి రాలేదని ఆ పార్టీలోని సీనియర్ల అభిప్రాయం. ఎప్పుడూ వ్యక్తిగత ప్రచారం కోసం పాకులాడుతూ కాంగ్రెస్కు నష్టం చేకూర్చుతున్నాడని గిట్టని వాళ్లు భావిస్తున్నారు. పైగా ఎలాంటి సమాచారం లేకుండా సీనియర్ల నియోజకవర్గాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇలాంటి పరిణామాలను ఎప్పటికప్పుడు అధిష్టానంకు చేరవేస్తోన్న సీనియర్లు, పీసీసీ చీఫ్ ను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ల మీద కోవర్ట్ లు అంటూ రేవంత్ టీం ముద్ర వేస్తుందని మండిపడుతున్నారు.
తొలి నుంచి జగ్గారెడ్డి, కోమటిరెడ్డి, వీహెచ్, ఉత్తమ్ తదితరులు రేవంత్కు వ్యతిరేకంగా బాహాటంగా మాట్లాడుతున్నారు. ఇంకొందరు లోలోన రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీళ్లంతా హుజూరాబాద్ ఫలితాలను కోడ్ చేస్తున్నారు. అంతేకాదు, కేటీఆర్, రేవత్ ఉండే ఫోటోలను ఈ మధ్య బయటకు తీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద కోవర్ట్ రేవంత్ అంటూ జగ్గారెడ్డి ఫోటోలను విడుదల చేస్తున్నాడు. సభ్యత్వ నమోదులోనూ కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకబడింది. డిజిటల్ సభ్యత్వం విషయంలో రేవంత్ వెనుకబడ్డాడు. ఇలాంటి అంశాలపై తేల్చేకోవడానికి ఈనెల ఐదవ తేదీన సీనియర్లు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. అయితే,ఆ రోజున కమిటీ సమావేశానికి రేవంత్ హాజరయ్యేందుకు కోవిడ్ అడ్డుపడుతోంది. సో..ఆయన పరోక్షంలో సీనియర్ల గళం మరింత పెరిగే ఛాన్స్ లేకపోలేదు.
Related News
Congress: బీఆర్ఎస్కు షాక్.. కాంగ్రెస్లోకి గుండు సుధారాణి
క్షేత్రస్థాయిలో నేతల మధ్య విభేదాలు చలించకుండా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీని వీడిన నేతలకు, ఇతర పార్టీల నేతలకు తెలంగాణ కాంగ్రెస్ ఘన స్వాగతం పలుకుతోంది.