Telugu Language Day : ఇవాళ తెలుగు భాషా దినోత్సవం.. ఈరోజు ప్రత్యేకత తెలుసా ?
ఆగస్టు 29వ తేదీనే తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక కారణం ఉంది.
- By Pasha Published Date - 10:40 AM, Thu - 29 August 24

Telugu Language Day : ఇవాళ (ఆగస్టు 29) తెలుగు భాషా దినోత్సవం. మన దేశంలో హిందీ , బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడేది తెలుగు భాషనే. తెలంగాణ, ఏపీతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో కూడా తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. ఆగస్టు 29వ తేదీనే తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే.. ఆ రోజున తెలుగు కవి(Telugu Language Day) గిడుగు వేంకట రామమూర్తి జయంతి ఉంది.
We’re now on WhatsApp. Click to Join
గిడుగు వేంకట రామమూర్తి తెలుగు భాషా ఉద్యమానికి ఆద్యులు. ఈయన తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, దాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు ఎనలేని కృషి చేశారు. తెలుగు భాషకు అందించిన సేవలకు గుర్తుగా గిడుగు రామ్మూర్తి జయంతినే మాతృ భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. అయితే తెలుగు భాష వికాసానికి ఆయన ఒక్కరే ప్రయత్నాలు చేయలేదు. ఇంకా చాలామంది ఇందుకోసం పాటుపడ్డారు. ఆ జాబితాలో కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు వంటి వారు కూడా ఉన్నారు.
Also Read :September New Rules : సెప్టెంబరులో 5 కొత్త మార్పులు.. క్రెడిట్ కార్డుల నుంచి ఆధార్ కార్డు దాకా..
గిడుగు వేంకట రామమూర్తి 1863 ఆగస్టు 29న అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకీ, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాల పేట గ్రామంలో జన్మించారు. ఆయన ఉపాధ్యాయుడు, చరిత్ర, శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్త. పదవీ విరమణ తరువాత 1911 నుంచి 1936 దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ తెలుగు భాషకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలను గిడుగు రామ్మూర్తి చేపట్టారు. 1936లో బ్రిటీష్ ప్రభుత్వం ఒడిశాకు ప్రత్యేక ప్రావిన్సును ఏరాటు చేస్తూ తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉండే పర్లాకిమిడిని ఒడిశాలో కలపడానికి నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గిడుగు రామ్మూర్తి రాజమండ్రికి వచ్చి, ఇక్కడే స్థిరపడిపోయారు. తెలుగు భాషపై, తెలుగు నేలపై ఆయనకు ఉన్న ప్రేమాభిమానాలకు ఈ ఘటన నిలువెత్తు నిదర్శనం.