Sandhya Theater Incident : రేవతి కుటుంబానికి రూ. 25 లక్షలు సాయం ప్రకటించిన ప్రభుత్వం
Sandhya Theater Incident : సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 25 లక్షలు ఆర్థిక సహాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది
- By Sudheer Published Date - 04:00 PM, Sat - 21 December 24

పుష్ప 2 (Pushpa 2) సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి 25 లక్షలు ఆర్థిక సహాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సినిమా ప్రీమియర్ షో విడుదల సందర్భంగా రేవతి తన భర్త ఇద్దరు పిల్లలతో థియేటర్కు వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో సినిమా హీరో అల్లు అర్జున్ రావడంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో రేవతి ఆమె కుమారుడు శ్రీతేజలు తీవ్రంగా గాయపడ్డారు. రేవతిని ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది. కుమారుడు శ్రీ తేజ మాత్రం ప్రస్తుతం సికింద్రాబాద్ లోని కిమ్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటనపై ఇప్పటికే సినిమా థియేటర్ యాజమాన్యం సభ్యులని, సినిమా హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరంతా బెయిల్ పై జైలు నుండి విడుదల అయ్యారు.
ఈ తొక్కిసలాట ఘటన పై అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) స్పందించారు. సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారు. అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదు, కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారు. దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ఒక్కసారిగా పబ్లిక్ సంధ్య థియేటర్ వైపు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోయింది… ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళాడు. అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు… బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిది..కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయింది.
హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగింది. ఈ విషయాన్ని హీరోకు ఏసీపీ చెప్పినా… శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా హీరో వినలేదు. బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని సిటీ కమిషనర్ చెప్పారు. దీంతో డీసీపీ వెళ్లి అక్కడ నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారు ఎక్కించారు. అయినా వెళ్ళేటప్పుడు కూడా కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లారు. ఈ నేపథ్యంలో హీరోపై , యాజమాన్యం పై పోలీసులు కేసు పెట్టారు. బాధ్యత రహితంగా సమాధానాలు ఇవ్వడం వల్లే పోలీసులు వారి విధి నిర్వహించారు. ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయి.
తన కొడుకు ఆ హీరో అభిమాని అని కొడుకు కోసం ఒక్కో టికెట్ రూ.3వేల చొప్పున రూ.12వేలు పెట్టి ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారు. థియేటర్ లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదు. అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చావుకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిస్తే… తప్పు పట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఎంతో నీచమైన భాష వాడారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి మా ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్లను ఏమీ అనొద్దు అంటే ఇదేం న్యాయం.
సినీ, రాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా చేస్తారా?
అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లో బడే మా ప్రభుత్వం నడుచుకుంటోంది. జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో.. బాధిత కుటుంబాన్ని ఒక్కరైనా కలిసారా..సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నరో తెలియడం లేదు. వ్యాపారాలు చేసుకోండి… కానీ ప్రాణాలతో చేలాగాటమాడటానికి మేం ఒప్పుకోము. మేం అధికారంలో ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగవు అని హెచ్చరించారు సీఎం.
Read Also : WhatsApp Vs Pegasus : ఆ దుశ్చర్య ఇజ్రాయెల్ కంపెనీదే.. భారత్ సహా ఎన్నోదేశాల వాట్సాప్ యూజర్లపై నిఘా