Protest : ఆందోళన బాట పట్టనున్న తెలంగాణ రైతులు & ఉద్యోగ సంఘాలు
Telangana Farmers & Trade Unions Protest : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట పడుతున్నట్టు ప్రకటించాయి
- By Sudheer Published Date - 12:12 PM, Wed - 23 October 24

అన్నదాతల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఈ నెల 25 నుంచి 31 వరకు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆందోళనలకు పిలుపునిచ్చింది. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రూ.2లక్షల రుణమాఫీ చేయాలని, అన్ని రకాల పంటలకు రూ. 500 బోనస్ చెల్లించాలని, 58 ఏళ్లు దాటిన ప్రతి రైతు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ. 10వేల పెన్షన్ ఇవ్వాలని కోరింది. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో జరిగే ఆందోళనల్లో రైతన్నలు పాల్గొనాలని పిలుపునిచ్చింది.
మరోపక్క ఉద్యోగులు సైతం సమ్మె బాటపట్టేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట పడుతున్నట్టు ప్రకటించాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ జీవితాల్లో మార్పు వస్తుందని భావించినా అది జరగలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలలైనా వాటిని పరిష్కరించ లేదని విధిలేని పరిస్థితుల్లో ఉద్యమబాట పడుతున్నట్టు తెలంగాణ ఉద్యోగుల ఐకాస ప్రకటించింది. తాజాగా తెలంగాణ ఎన్జీవో కేంద్ర కార్యాలయంలో 206 ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షవర్ల, కార్మిక సంఘాలతో కూడిన తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి సమస్యల పరిష్కారం కోసం అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్ర టరీ ఏలూరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో ఇప్పటికే ఐదు డిఏలు బకాయిలో ఉండటం చరిత్రలో ఎన్డూ చూడలేదని జేఏసీ నేత జగదీశ్వర్ అన్నారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదని ఆరోపించారు. బకాయిలు చెల్లించాలని, తమ పొదుపు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాలిచ్చినా కనీసం చర్చించే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దసరాలోగా రెండు డీఏలు వస్తాయని ఆశలు పెట్టుకున్నామని, ఇప్పుడు దీపావళి పై ఆశలు పెట్టుకున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వాలు గౌరవం లేకుండా చేశాయని ఆరోపించారు. ఉద్యోగుల సమస్యలపై 26న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన ఆరు ప్రధాన డిమాం డ్లను పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోలేదని జేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల 44 ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి కూడా చొరవ తీసుకోలేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక్క రోజు ఉద్యోగ సంఘాలతో కూర్చొని చర్చిస్తే వాటిని పరిష్కరించవచ్చన్నారు.
ఆరు ప్రధాన డిమాండ్లు:
2022 జూలై 1 నుంచి పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేసి, బకాయిలను నగదు రూపంలోనే చెల్లించాలనే డిమాండ్.
పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలి:
పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను మంజూరు చేయడంతో పాటు, ఇ-కుబేర్ వ్యవస్థను రద్దు చేయాలని, ఖజానా శాఖ ద్వారా పాత విధానాన్ని పునరుద్ధరించి బిల్లులను క్లియర్ చేయాలని కోరుతున్నారు.
ఫిట్మెంట్ (వేతన సవరణ):
ధరల పెరుగుదల ప్రకారం ఉద్యోగులకు 51% ఫిట్మెంట్ ఇవ్వాలని, 2వ వేతన సంఘం (పీఆర్సీ) సిఫార్సులను తీసుకొచ్చి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS):
ప్రభుత్వంతో పాటు ఉద్యోగులు/పెన్షనర్ల కంట్రిబ్యూషన్ను సమానంగా ఉంచి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) అమలు చేయాలని కోరుతున్నారు.
సీపీఎస్ రద్దు:
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్.
జీవో 317 సమీక్ష:
ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో 317ను సమీక్షించి, బాధితుల ఫిర్యాదులను పరిష్కరించాలని కోరుతున్నారు.
జేఏసీ ఉద్యమ ప్రణాళిక:
నవంబరు 2: అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకు కార్యాచరణ లేఖలు అందజేస్తారు.
నవంబర్ 4, 5: జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పిస్తారు.
నవంబర్ 6: రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తారు.
నవంబర్ 7 నుంచి డిసెంబరు 27: 10 ఉమ్మడి జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తారు.
జనవరి 3-4: నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతారు; భోజన విరామంలో నిరసనలు చేపడతారు.
జనవరి 21: అన్ని జిల్లాల్లో మౌన ప్రదర్శనలు నిర్వహిస్తారు.
జనవరి 23: రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహిస్తారు.
జనవరి 30: అన్ని కార్యాలయాల వద్ద మానవహారాలతో నిరసనలు చేపడతారు.
ఈ ఉద్యమ ప్రణాళిక ద్వారా ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని ఆశిస్తున్నారు.
Read Also : YSRCP: జగన్ కు షాక్? వైసీపీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా!