Congress Leaders : ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
Congress Leaders : TPCC చీఫ్ మహేశ్ కుమార్(Mahesh Kumar)తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు
- By Sudheer Published Date - 05:33 PM, Sun - 5 October 25

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల (BC Reservation) అంశం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఈ క్రమంలో TPCC చీఫ్ మహేశ్ కుమార్(Mahesh Kumar)తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై చట్టపరమైన అంశాలను సమీక్షించనున్నారు. కేంద్రానికి అనుకూలంగా చట్టపరమైన వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులతో సమావేశం కావడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహాన్ని స్పష్టత చేసుకోవాలనుకుంటోంది.
బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే పిటిషన్ సుప్రీంకోర్టులో ఉండటంతో, ఈ విషయంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేసి, చట్టబద్ధతను రుజువు చేసే దిశగా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. TPCC నేతలు ఢిల్లీలో ప్రముఖ లాయర్లతో భేటీ అవడం ద్వారా వాదనలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేసు రాబోయే స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ఇకపోతే రాష్ట్రంలో ఇప్పటికే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, రిజర్వేషన్లపై స్పష్టత లేకపోతే పోలింగ్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని సీఎం రేవంత్ రెడ్డి నేతలకు సూచించారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ సూచనల మేరకు ఈ ముగ్గురు నేతలు ఢిల్లీలో న్యాయ సలహాలు తీసుకుని, రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని చట్టబద్ధంగా నిలబెట్టే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రయత్నం విజయవంతమైతే స్థానిక ఎన్నికల దారిలో కాంగ్రెస్కు సులభతరం అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.