Sex workers: నాడు ‘ఒళ్లు’ అమ్ముకున్నాం.. నేడు ‘బిచ్చం’ అడుక్కుంటున్నాం!
యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి డెవలప్ చేస్తోన్న సమయంలో అక్కడి ఇబ్బందులన్నీ తొలగించాలని ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా గుట్ట కింద ఉన్న సెక్స్ వర్కర్స్ కి పునరావాసం కల్పిస్తామని, తాము చేసేవృత్తి మానుకోవాలని ప్రభుత్వం సూచించింది.
- By Siddartha Kallepelly Published Date - 07:45 PM, Sun - 26 December 21
(యాదాద్రి నుంచి వీడియో జర్నలిస్ట్ వెంకట్తో మా ప్రతినిధి సిద్ధార్ధ)
‘ఇంతకముందు ఒళ్లు అమ్ముకొని బ్రతికేవాళ్ళం, ఇప్పుడు బిచ్చం అడుక్కొని బతకాల్సివస్తోంది’ యాదాద్రిలో ఓ సెక్స్ వర్కర్ల మాటలివి.
యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి డెవలప్ చేస్తోన్న సమయంలో అక్కడి ఇబ్బందులన్నీ తొలగించాలని ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా గుట్ట కింద ఉన్న సెక్స్ వర్కర్స్ కి పునరావాసం కల్పిస్తామని, తాము చేసేవృత్తి మానుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ సూచనపై ఆలోచించిన సెక్స్ వర్కర్స్ తాము పనిచేసుకొని గౌరవంగా బ్రతుకుతామని అనుకున్నా తమ కులం కారణంగా ఎవరూ పనిలోకి తీసుకోవడం లేదని, దిక్కు లేక ఈ పని చేస్తున్నామని, ప్రభుత్వం పునరావాసం కల్పిస్తే మా బాధలన్నీ తీరుతాయని భావించి సెక్స్ వర్క్ చేయడం ఆపేసారు. దారిచూపుతామని ప్రకటించిన ప్రభుత్వం పత్తా లేకుండా పోయింది. భరోసా ఇస్తారన్న అధికారులే తమ పాలిట గుదిబండలయ్యారని సెక్స్ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వమే చెప్పిందని, ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని అన్నప్పుడల్లా మా ఇండ్లపై దాడులు చేసి సెక్స్ వర్క్ చేస్తున్నామని వేధిస్తూ తమ ఇండ్లల్లో అవి దొరికాయ్ ఇవి దొరికాయని ఆరోపిస్తూ తమపై తప్పుడు కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారని, ప్రశ్నిస్తే పీడీ యాక్టులు పెడుతున్నారని మహిళలు బాధపడుతున్నారు. చేయని తప్పులకు దోషుల్లా చూస్తున్నారని, ఇంట్లోకి వచ్చి మొగుడ్ని, కుటుంబసభ్యులను, అప్పుడప్పుడు వచ్చే చుట్టాలను పట్టుకొని, వీడి దగ్గర ఎంత తీసుకున్నావనో, ఇంకా నడిపిస్తున్నావా అనో చెప్పుకోవడానికి వీలుకాని భాషతో ఇబ్బంది పెడుతున్నారని సెక్స్ వర్కర్స్ చెప్పుకొని బాధపడుతున్నారు.
సెక్స్ వర్క్ మానేసాక తమ పరిస్థితి దారుణంగా అయ్యిందని, తమలో హెచ్ఐవి సోకిన వారు ఉన్నారని, కనీసం నెలనెల మెడిసిన్స్ తెచ్చుకోవడానికి కుడా డబ్బులు ఉండట్లేవని, చూసుకునేవాళ్ళు ఎవరులేరని, కంట్రోల్ బియ్యం ఉంటే తినడం, అది కూడా లేకపోతే నీళ్లు తాగి పడుకుంటున్నామని బాధితులు చెప్తున్నారు. పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక బడి మానేపిస్తున్నామని సీఎంని కలిసి తమ బాధలు చెప్పుకోవాలని ఉందని బాధితులు తెలిపారు.
దేశంలో ఎన్నో చోట్ల సెక్స్ వర్క్ జరుగుతోందని, హైటెక్ సెక్స్ వర్కర్స్ ని ప్రభుత్వం ఎందుకు వదిలేస్తుందని యాదాద్రి సెక్స్ వర్కర్స్ ప్రశ్నిస్తున్నారు. తాము మాత్రమే తప్పు చేస్తున్నట్లు తమతో దందా బందు చేయించారని, అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోన్న ప్రభుత్వం కొత్త జీవితం మొదలుపెట్టాలనుకుంటున్న తమకు ఏదైనా సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు 25ఎకరాల భూమిని ఇస్తామని, దానిలో పూలు పండ్లు పెంచడం లాంటి పనులు చేసుకోవచ్చని అప్పటి పోలీస్ అధికారి మహేష్ భగవత్ హామీ ఇచ్చారని కానీ ఇప్పటికీ మాకు ఏం ఇవ్వలేదని యాదాద్రి టెంపుల్ ప్రారంభోత్సవ సమయంలోపైనా తమకు కనీసం గుడిలో స్వీపర్ ఉద్యోగాలైనా ఇవ్వాలని సెక్స్ వర్కర్స్ కోరుతున్నారు.
యాదాద్రిలో దాదాపు 150 కుటుంబాలు తమపూర్వికుల నుండి సెక్స్ వర్క్ చేస్తున్నామని సెక్స్ వర్కర్స్ తెలిపారు. ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు పుడితే ఒక అమ్మాయిని చదివించి, ఇంకో అమ్మాయిని సెక్స్ వర్క్ లోకి దించేవాళ్లమని దానికి ప్రధానకారణం కులం కారణంగా తమపై చూపే వివక్షతతో పనిచేద్దామనుకున్నా తమని దూరం పెట్టారని, సమాజంలోని ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాలని సెక్స్ వర్కర్స్ తమ దీనగాథను తెలిపారు. తినడానికి తిండి లేక, చేద్దామంటే పనిదొరక్క, అప్పులబాధతో చావు బ్రతుకుల మధ్య బతుకు బండిని లాగుతున్నామని,
కేసీఆర్ ని కలిస్తే తమ జీవితాలకు ఒకదారిని చూపిస్తారని ఆశిస్తున్నామని కానీ కలిసే అవకాశం దొరకట్లేదని బాధితులు తమ కన్నీళ్లను hashtagU తో పంచుకున్నారు.
Related News
Vehicle Registration: షోరూమ్లలోనే వాహన రిజిస్ట్రేషన్ల కోసం కసరత్తు..!
వాహన రిజిస్ట్రేషన్ల కోసం ప్రాంతీయ రవాణా సంస్థ (ఆర్టీఏ) కార్యాలయాల వద్ద సుదీర్ఘ క్యూల మధ్య, వాహనం కొనుగోలు చేసేటప్పుడు షోరూమ్లలోనే శాశ్వత రిజిస్ట్రేషన్లు చేసే అవకాశాన్ని రవాణా శాఖ పరిశీలిస్తోంది.