Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు, రాధాకిషన్రావుకు బెయిల్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై(Phone Tapping Case) దర్యాప్తును మొదలుపెట్టింది.
- By Pasha Published Date - 11:29 AM, Thu - 30 January 25

Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచింది. విపక్ష నేతలను, పలువురు జడ్జీలను టార్గెట్గా చేసుకొని ఫోన్లను ట్యాప్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై(Phone Tapping Case) దర్యాప్తును మొదలుపెట్టింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు ఇవాళ బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు వీరికి బెయిల్ను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రూ.లక్ష చొప్పున 2 పూచీకత్తులు, పాస్పోర్టులను సమర్పించాలని వారిని హైకోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తునకు సహకరించాలని నిర్దేశించింది.
Also Read :Cyber Crimes : సైబర్ కేటుగాళ్లతో బ్యాంకు ఉద్యోగులకు లింకులు.. బండారం బయటపెట్టిన పోలీసులు
మేకల తిరుపతన్నకు జనవరి 27న బెయిల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మేకల తిరుపతన్నకు గత సోమవారం రోజున (జనవరి 27న) సుప్రీంకోర్టు బెయిల్ను మంజూరు చేసింది. ఆయన దాదాపు గత 10 నెలలుగా కస్టడీలోనే ఉన్నారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీంతో నిందితుడు తిరుపతన్నకు దేశ సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. తనకు బెయిల్ కోరుతూ గతంలో తిరుపతన్న హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. దీంతో ఆయన 2024 సంవత్సరం అక్టోబరు 20న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై గత సోమవారం రోజు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘ఈ కేసులో తిరుపతన్న పాత్రపై మరింత సమగ్ర దర్యాప్తు అవసరం. దీనికి మరో నాలుగు నెలల సమయం పడుతుంది’’ తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ వాదనలు విన్న సుప్రీంకోర్టు బెంచ్ షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
Also Read :Maha Kumbh Stampede : అర్ధరాత్రి యోగి సమీక్ష.. మహాకుంభ మేళాపై కీలక నిర్ణయాలు
ఇద్దరు హైకోర్టు జడ్జిల ఫోన్లను, ఐపీ అడ్రస్లను..
తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో మరో ఇద్దరు హైకోర్టు జడ్జిల ఫోన్లను, ఐపీ అడ్రస్లను కూడా ట్యాప్ చేశారని తాజాగా దర్యాప్తులో గుర్తించారు. నాటి ఎస్ఐబీ ఓఎస్డీ ప్రభాకర్ రావు నేతృత్వంలో ఈ ట్యాపింగ్ తతంగం నడిచిందని గుర్తించారు. ఈ ఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్న ఎస్ఐబీ విభాగం సిబ్బంది ఒకరి ఫోన్ను ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ విశ్లేషించగా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఆ ఫోన్లో ఇద్దరు జడ్జిల ఫొటోలు, వారి ప్రొఫైల్స్ వివరాలు ఉన్నట్లు తేలింది. ఒక జడ్జి ప్రొఫైల్పై ఆర్ఎస్ఎస్, బీజేపీ బ్యాక్గ్రౌండ్ అని రాసిపెట్టుకున్నట్లు గుర్తించారు.