Azharuddin: ఎల్బీ స్టేడియంలో సిక్సులతో చెలరేగిన మంత్రి అజారుద్దీన్..
- Author : Vamsi Chowdary Korata
Date : 30-03-2026 - 11:01 IST
Published By : Hashtagu Telugu Desk
Mohammad Azharuddin భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, హైదరాబాద్ సొగసరి బ్యాటర్ మహమ్మద్ అజారుద్దీన్ చాలా కాలం తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు. తన ట్రేడ్మార్క్ షాట్లతో అలరించి, వరుస సిక్సర్లు బాది జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ‘తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్-2026’లో భాగంగా ఆదివారం ఈ ఆసక్తికర పోరు జరిగింది.
ఈ మీట్లో భాగంగా జరిగిన క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నేతృత్వంలోని మంజీర జట్టు, ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సారథ్యంలోని మూసీ రివర్ జట్టు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన మంజీర జట్టు 6 ఓవర్లలో 66 పరుగులు చేసింది. ఈ జట్టులో మంత్రి వాకిటి శ్రీహరి కూడా ఆడారు. లక్ష్య ఛేదనలో చివరి 11 బంతుల్లో 22 పరుగులు అవసరమైన దశలో అజారుద్దీన్ క్రీజులోకి వచ్చారు. రెండు సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి మూసీ రివర్ జట్టును గెలిపించారు.
ఈ క్రీడా సంబరాల్లో కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా షాట్పుట్, జావెలిన్ త్రో, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి పలు పోటీలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు రాజకీయాలను పక్కనపెట్టి క్రీడాస్ఫూర్తితో ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మందుల సామేల్ డప్పు వాయిస్తూ తోటి క్రీడాకారులను, ప్రేక్షకులను ఉత్సాహపరిచి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.