KCR BRS: బీఆర్ఎస్ దూకుడు.. మాణిక్ కదమ్ కు కీలక బాధ్యతలు!
మహారాష్ట్రకు సంబంధించిన కిసాన్ సమితి బాధ్యతలను కేసీఆర్ మాణిక్ కదమ్కు అప్పగించారు.
- By Balu J Published Date - 07:16 PM, Sun - 26 February 23

భారత రాష్ట్ర కిసాన్ సమితి (బీఆర్కేఎస్)లను బలోపేతం చేయడంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్రకు సంబంధించిన కిసాన్ సమితి బాధ్యతలను మాణిక్ కదమ్కు అప్పగించారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణలో కిసాన్ సమితి కీలక పాత్ర పోషించనున్నది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో రైతులకు తెలంగాణలో అమలు అవుతున్న పథకాలను వివరించేందుకు.. భవిష్యత్లో బీఆర్ఎస్ అందించబోయే స్కీమ్లను తెలియజేయడానికి కిసాన్ సమితి కృషి చేస్తోంది.
తెలంగాణలో అమలు అవుతున్న రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలకు ఇతర రాష్ట్రాల్లో కూడా మంది ఆదరణ లభిస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ రెండు పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉన్నది. అందుకే ఇతర రాష్ట్రాల ప్రజలకు ఈ పథకాలపై అవగాహన కల్పించే బాధ్యతను కిసాన్ సమితికే అప్పగించారు. ఇప్పటికే కిసాన్ సమితి జాతీయ అధ్యక్షుడిగా గుర్నామ్సింగ్ చడూనీని నియమించారు. ఈ క్రమంలో మహారాష్ట్ర విభాగానికి మాణిక్ కదమ్కు బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి బాధ్యతలను తనకు అప్పగించడంపై మాణిక్ కదమ్ హర్షం వ్యక్తం చేశారు.