Fraud :సూర్యాపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసం
- Author : Prasad
Date : 03-06-2026 - 7:19 IST
Published By : Hashtagu Telugu Desk
తక్కువ డబ్బులకు అధిక రాబడులు వస్తాయని నమ్మించి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని కోదాడ్ పట్టణంలోని శ్రీరంగపురం గ్రామంలో జరిగింది. తమను దాదాపు రూ. 11 కోట్లు మోసం చేశాడని గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో శ్రీరంగపురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇరిగిల్ల జితేంద్ర రెడ్డి అధిక వడ్డీ రేట్లు, అసలు మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చి, సుమారు 45-50 మందిని తన వద్ద రూ. 7 కోట్లు పెట్టుబడి పెట్టేలా ఒప్పించారని పోలీసులు తెలిపారు. అతని హామీలను నమ్మి, గ్రామస్తులు కొంత కాలం పాటు పెద్ద మొత్తంలో డబ్బును అందజేశారని.. అయితే ఆ వ్యాపారవేత్త వడ్డీ చెల్లింపులను నిలిపివేయడం.. అసలు మొత్తాలను తిరిగి ఇవ్వడంలేదని గ్రామస్తులు ఆరోపించారు. మే 13న, తాను బాకీ ఉన్న రూ. 11 కోట్లకు బదులుగా, వడ్డీతో సహా సుమారు రూ. 9 కోట్లు మాత్రమే చెల్లించగలనని తెలియజేస్తూ అతను లీగల్ నోటీసులు పంపాడు. మరోవైపు వ్యాపారి తన ఆస్తులన్నింటినీ వెల్లడించడం లేదని, వాస్తవానికి పూర్తి రూ. 11 కోట్లు తిరిగి చెల్లించే స్తోమత అతనికి ఉందని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయంపై దాదాపు నెల రోజులుగా చర్చలు జరుగుతున్నప్పటికీ, జూన్ 1న వ్యాపారి తన సోదరి పేరు మీద రెండు ప్లాట్లు కొనడంతో గ్రామస్తులకు అనుమానం వ్యక్తమయింది. దీంతో వెంటనే డబ్బు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు వ్యాపారవేత్త నివాసం ముందు నిరసన చేపట్టడంతో, పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనను విరమించేలా చేశారు.