Kishan Reddy on Jubilee Hills by Election : జూబ్లిహిల్స్ బై పోల్ వేళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Kishan Reddy on Jubilee Hills by Election : తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మూడు ప్రధాన పార్టీలు – కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ – అన్నీ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని దుమ్మురేపుతున్నాయి
- By Sudheer Published Date - 06:30 PM, Mon - 3 November 25
తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మూడు ప్రధాన పార్టీలు – కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ – అన్నీ ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారాన్ని దుమ్మురేపుతున్నాయి. బీజేపీ తరఫున కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి ప్రచార బాట పట్టి, కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శల వర్షం కురిపించారు. “జూబ్లీహిల్స్లో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయం” అని ధీమా వ్యక్తం చేసిన ఆయన, బీఆర్ఎస్పై విరుచుకుపడి “అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేసీఆర్ ప్రజల్లో కనిపించడం లేదని” ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలు కూడా బీజేపీ అభ్యర్థికి సానుభూతి చూపుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “పాకిస్థాన్ లింక్” వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన, “ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ మర్యాదలకు విరుద్ధం” అని హెచ్చరించారు.
Electric Scooter Sales: అక్టోబర్లో ఏ బైక్లు ఎక్కువగా కొనుగోలు చేశారో తెలుసా?
ప్రచార సభల్లో మాట్లాడుతూ కిషన్ రెడ్డి ప్రభుత్వం పై పలు అంశాలపై విమర్శలు గుప్పించారు. “ఫ్రీ బస్సు, సన్నబియ్యం అని ఇచ్చిన పథకాలలో కేంద్రం వాటా ఎక్కువ” అని పేర్కొని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు. “సీఎం రేవంత్ మాట్లాడే భాషే తప్పు దిశలో ఉంది. ప్రజలను అవమానించే విధంగా మాట్లాడడం సరైంది కాదు” అంటూ ఫైర్ అయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో విజిలెన్స్ దాడుల పేరుతో విద్యాసంస్థలను బెదిరించడం తగదని ఆయన మండిపడ్డారు. “రీయింబర్స్మెంట్ ఇవ్వమంటే బెదిరిస్తారా? విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు” అని అన్నారు. ఇక కాంగ్రెస్ మైనారిటీల పట్ల నిజమైన చిత్తశుద్ధి లేనిదని వ్యాఖ్యానించారు. మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టుకు డీపీఆర్ను కేంద్రానికి పంపకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ఆయన ఎద్దేవా చేశారు.
కిషన్ రెడ్డి ప్రకారం, బీజేపీ ఈ ఉపఎన్నికను కేవలం స్థానిక స్థాయి పోటీగా కాకుండా రాష్ట్రవ్యాప్త రాజకీయ సూచికగా తీసుకుంటోంది. “మేము సర్వేలు చేయం, ప్రజల మధ్య ఉంటాం. బూత్ స్థాయిలో పనిచేస్తాం” అంటూ ఆయన స్పష్టం చేశారు. 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో సమన్వయంగా ప్రచారం సాగుతోందని తెలిపారు. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చి మైనారిటీల ఓట్లు పొందాలని కాంగ్రెస్ ప్రయత్నం విఫలమవుతుందని పేర్కొన్నారు. “బీఆర్ఎస్కు భవిష్యత్ లేదు, కాంగ్రెస్ పాలనలో అసంతృప్తి రోజురోజుకీ పెరుగుతోంది” అంటూ ధ్వజమెత్తిన ఆయన, బీజేపీనే ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు భావిస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు తెలంగాణలో రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశముందని, ఈ పోరాటం కాషాయ శక్తులకు కొత్త బలం ఇస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సంకేతాలిస్తున్నాయి.