Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్.. సీబీఐ విచారణ జరిపించాలి : లక్ష్మణ్
Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
- Author : Pasha
Date : 28-03-2024 - 2:51 IST
Published By : Hashtagu Telugu Desk
Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలు టార్గెట్గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నాడు జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి మూలకారకులు కేసీఆర్, కేటీఆర్ అని ఆయన ఆరోపించారు. ‘‘కేసీఆర్ ఫోన్ట్యాపింగ్ చేయించి ప్రతిపక్ష నేతల ప్రాథమిక హక్కుకు భంగం కలిగించారు. రెండో, మూడో ఫోన్ట్యాపింగ్లు జరిగితే జరగొచ్చని కేటీఆర్ అంటున్నారు. ఫోన్ట్యాపింగ్ చేయాలంటే కేంద్ర హోంశాఖ అనుమతి కావాలని వాళ్లకు తెలియదా ?’’ అని లక్ష్మణ్ మండిపడ్డారు. ‘‘నియంతృత్వాన్ని నమ్ముకున్న వాడు నీడను కూడా నమ్మడు. కేసీఆర్ కూడా ఎవరినీ నమ్మలేదు. ఎవరినీ నమ్మే స్వభావం లేకపోవడం వల్లే రాజకీయ నాయకులు, మీడియా ప్రముఖుల ఫోన్లను కేసీఆర్ ట్యాపింగ్ చేయించారు’’ అని పేర్కొన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలను గమనించి ప్రజలు ఎన్నికల్లో ఓడించారని చెప్పారు. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘ఫోన్ ట్యాపింగ్కు(Phone Tapping Case) కేసీఆర్ ప్రభుత్వం పాల్పడితే సందట్లో సడేమియా అన్నట్లుగా కొందరు పోలీసులు అధికారులు సర్దుకున్నారు. వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు’’ అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కదలలేదని, సచివాలయానికి ఒక్కసారి కూడా వెళ్లలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రతి పథకంలో స్కామ్లు చేశారన్నారు. కమీషన్లు తీసుకున్నారని, ప్రశ్నించే వారిని బెదిరింపులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read :Sleeping On Currency : కరెన్సీ నోట్లతో పొలిటీషియన్ నిద్ర.. ఫొటోలు వైరల్
ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో కొంతమంది పోలీసు అధికారులు ఏ రకంగా అక్రమార్జన చేశారో ఇప్పుడిప్పుడే బయటపడుతోందని లక్ష్మణ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐతో విచారణ జరిపించి, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తాటాకు చప్పుళ్లు కాదని నిరూపించుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి లీకు వీరుడు కాదు గ్రీక్ వీరుడైతే సీబీఐ విచారణకు వెంటనే ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుందని, కేసీఆర్ కుటుంబాన్ని శిక్షించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.