KCR : కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. బీఆర్కే భవన్ వద్ద భారీ బందోబస్తు
మాజీ మంత్రులు మల్లారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత తదితరులు బీఆర్కే భవన్ వద్దకు వచ్చారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చేఅవకాశముండటంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ బీఆర్కే భవన్కు చేరుకున్నారు.
- Author : Latha Suma
Date : 11-06-2025 - 11:03 IST
Published By : Hashtagu Telugu Desk
KCR : హైదరాబాద్లోని బూర్గుల రామకృష్ణారావు (బీఆర్కే) భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు అక్కడికి చేరుకున్నారు. మాజీ మంత్రులు మల్లారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత తదితరులు బీఆర్కే భవన్ వద్దకు వచ్చారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చేఅవకాశముండటంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ బీఆర్కే భవన్కు చేరుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు, డిజైనర్లను విచారించి స్టేట్మెంట్లను రికార్డు చేసిన కమిషన్, ఇక ఆనాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలపై దృష్టిసారించింది.
Read Also: KTR : కేసీఆర్ జీవితం ఒక చరిత్రగా నిలిచిపోతుంది: కేటీఆర్
మార్చ్ నెలాఖరి కల్లా ప్రభుత్వానికి నివేదిక అందించేలా కాళేశ్వరం కమిషన్ కసరత్తు చేస్తోంది. మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ను కమిషన్ విచారణకు పిలవనుంది. కమిషన్ విచారణలో భాగంగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపాలు, అవినీతి తదితర అంశాలపై విచారిస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటు, లోపాలు, అవకతవకలపై న్యాయ విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిషన్ ఇప్పటికే నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, మాజీ ఈఎన్సీలతో పాటు చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలను విచారించింది. ఇక నీటిపారుదల శాఖ కార్యదర్శులుగా, ఇతర హోదాల్లో పనిచేసిన ప్రస్తుత, మాజీ ఐఏఎస్లను విచారించి బ్యారేజీల నిర్మాణంలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకున్నారన్న అంశంపై సాక్ష్యాలను సేకరించేందుకు సన్నద్ధమైంది.
కమిషన్ విచారణకు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించబడుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో, కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. విచారణలో భాగంగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన పాత్ర, నిర్ణయాలు, ఆదేశాలు తదితర అంశాలపై ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విచారణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తీసుకునే అవకాశం ఉంది. కమిషన్ విచారణకు సంబంధించిన తాజా పరిణామాలు, కేసీఆర్ హాజరయ్యే సమయం, భద్రతా ఏర్పాట్లు తదితర వివరాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.
Read Also: Investigation : అప్పుడు చంద్రబాబు..ఇప్పుడు కేసీఆర్