Kavitha : కేసీఆర్ పై కవిత దారుమైన వ్యాఖ్యలు
తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదేళ్ల పాలనపై ఆయన కుమార్తె కవిత మొదటిసారి బహిరంగంగా తీవ్ర విమర్శలు గుప్పించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేసీఆర్ సరిగ్గా పాలించలేదని, ఆయన వైఫల్యాల వల్ల తెలంగాణ నష్టపోయిందని ఆమె నేరుగా ఆరోపించారు
- Author : Sudheer
Date : 25-04-2026 - 12:20 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై కవిత చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదేళ్ల పాలనపై ఆయన కుమార్తె కవిత మొదటిసారి బహిరంగంగా తీవ్ర విమర్శలు గుప్పించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కేసీఆర్ సరిగ్గా పాలించలేదని, ఆయన వైఫల్యాల వల్ల తెలంగాణ నష్టపోయిందని ఆమె నేరుగా ఆరోపించారు. ముఖ్యంగా అభివృద్ధి కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించడం ద్వారా, ఆమె తన పాత రాజకీయ నేపథ్యం నుండి పూర్తిగా బయటకు వచ్చి, ఒక కొత్త స్వతంత్ర శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. “సొంత ఇంటి నుండే విమర్శలు” రావడం అనేది తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
జాతీయ రాజకీయాల మోజు – తెలంగాణకు అన్యాయం?
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి తెలంగాణ ప్రయోజనాలను పక్కన పెట్టారని కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. “పంజాబ్, గుజరాత్, బీహార్కు కేసీఆర్ వెళ్లారు.. నేషనల్ పార్టీ పెడతామని తిరిగారు కానీ, ఇక్కడి ప్రజలను పట్టించుకోలేదు” అని ఆమె ఎద్దేవా చేశారు. జాతీయ రాజకీయాల కోసం రాష్ట్ర వనరులను, సమయాన్ని వృధా చేశారని, ఫలితంగా పాలమూరు-రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయని ఆమె ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ దృష్టి పెట్టి ఉంటే ఇవాళ పాలమూరు భూములు సస్యశ్యామలం అయ్యేవని చెబుతూ, తండ్రి రాజకీయ వ్యూహాలను ఆమె తప్పుపట్టారు.
కొత్త పార్టీ అజెండా.. గతానికి చరమగీతం
బీఆర్ఎస్ (BRS) హయాంలో తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోయిందని, అందుకే తాను మళ్ళీ టీఆర్ఎస్ (TRS) పేరుతో ప్రజల ముందుకు వచ్చానని కవిత స్పష్టం చేశారు. తన తండ్రి పాలనలోని లోపాలను ఎత్తిచూపడం ద్వారా, తాను ప్రజల పక్షాన నిలబడతానని ఆమె భరోసా ఇస్తున్నారు. గతంలో తాము చేసిన తప్పులను ఒప్పుకుంటూనే, భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే తన లక్ష్యమని ఆమె ప్రకటించారు. మరి తండ్రిపైనే తిరుగుబావుటా ఎగురవేసిన కవితను తెలంగాణ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.