High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు 50 వేల జరిమానా
- Author : Vamsi Chowdary Korata
Date : 13-06-2026 - 10:03 IST
Published By : Hashtagu Telugu Desk
భూవివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు ‘హైడ్రా’ కమిషనర్ ఏవీ రంగనాథ్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు రూ. 50 వేల జరిమానా విధిస్తూ జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ధిక్కరణ కింద ఈ చర్యలు తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని ఖైరతాబాద్ మండలం, యూసఫ్గూడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 45లో ఉన్న రెండెకరాల భూవివాదంపై మహ్మద్ షఫాహతుల్లా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో న్యాయస్థానం యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఈ ఆదేశాలను ఉల్లంఘించి అధికారులు ప్రహరీ గోడ కూల్చివేసి, కంచె ఏర్పాటు చేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్పై తాజాగా జరిగిన విచారణలో, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి చివరి అవకాశం ఇచ్చినా ‘హైడ్రా’ స్పందించకపోవడంపై జస్టిస్ శ్రవణ్కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేటస్ కోను ఉల్లంఘించడాన్ని తప్పుబడుతూ కమిషనర్కు జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని చీఫ్ జస్టిస్ రిలీఫ్ ఫండ్కు చెల్లించాలని, ఆ తర్వాతే కేసులో కౌంటర్ అఫిడవిట్ను స్వీకరించాలని రిజిస్ట్రీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.