TGSRTC Tour Package: అరుణాచలం వెళ్లే భక్తులకు టిజిఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్!
కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. కాణిపాకం, వెల్లూరు గోల్డెన్ టెంపుల్తో పాటు అరుణాచల దర్శనాన్ని అందించే ఈ ప్యాకేజీ తెలంగాణలోని వివిధ జిల్లాల నుండి అందుబాటులో ఉంది.
- By Kode Mohan Sai Published Date - 03:52 PM, Thu - 7 November 24

Karthika Pournami Arunachalam Trip: కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త ప్రకటించింది. పరమేశ్వరుడి దర్శనాన్ని పొందేందుకు, టీజీఎస్ఆర్టీసీ అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్యాకేజీలో భక్తులకు కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ దర్శనంతో పాటు, వెల్లూరు గోల్డెన్ టెంపుల్ను కూడా సందర్శించే అదనపు సౌకర్యం అందిస్తున్నది.
తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ వంటి జిల్లాల నుండి అరుణాచలం గిరి ప్రదక్షిణ ప్యాకేజీ కోసం ప్రత్యేక బస్సులు నడిపేలా టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా, 13వ తేదీ నుంచి ఆయా జిల్లాల నుంచి ప్రత్యేక బస్సులు అరుణాచలానికి బయలుదేరతాయి. ప్రయాణం చివరికి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత కార్తీక పౌర్ణమి పర్వదినం నాటికి భక్తులు అరుణాచలానికి చేరుకుంటారు.
ఈ ప్రత్యేక ప్యాకేజీని http://tgsrtcbus.in వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చని సజ్జనార్ సూచించారు. మరిన్ని వివరాల కోసం, ప్రయాణికులు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లుకు 040-23450033, 040-69440000 సంప్రదించవచ్చు.
కార్తీక మాసం సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలకు దర్శనానికి టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట మరియు ఇతర శైవ క్షేత్రాలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆయన తెలిపారు.
కార్తీక మాసం, శబరిమల ప్యాకేజీలను టీజీఎస్ఆర్టీసీకు చాలా కీలకమైనవిగా ఆయన పేర్కొన్నారు. అలాగే, ఆది, సోమవారాలలో శైవ క్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక బస్సులలో ముందస్తు రిజర్వేషన్ కూడా అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు.
అరుణాచలం ప్యాకేజీ వివరాలు:
పౌర్ణమి రోజున అరుణాచలగిరి ప్రదక్షిణ చేయడం పుణ్యఫలమని భక్తులు నమ్ముతారు. ఈ సారి, నవంబర్ 15న పౌర్ణమి సందర్బంగా అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలని కోరుకునే భక్తుల కోసం తెలంగాణ టూరిజం శుభవార్త ప్రకటించింది. హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రారంభించినట్లు వారు వెల్లడించారు.
ఈ ప్రత్యేక టూర్, “హైదరాబాద్ – అరుణాచలం” పేరుతో రోడ్డు మార్గంలో ప్రారంభమవుతుంది. టూర్ 3 రాత్రులు, 4 పగళ్ల పాటు సాగుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో అరుణాచలేశ్వర ఆలయ దర్శనం, కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మరియు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ ను కూడా సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజీ ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది, మరియు నవంబర్ 13న ఈ టూర్ ప్రారంభం అవుతుంది.
మొదటి రోజు సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ బషీర్ బాగ్ నుంచి తెలంగాణ టూరిజం బస్సు బయలుదేరుతుంది.
రెండో రోజు ఉదయం 6 గంటకు యాత్రికులు కాణిపాకం చేరుకుంటారు. ఉదయం 9 గంటలకు కాణిపాకం ఆలయం దర్శనం ముగిస్తారు. ఆ తర్వాత వారు అరుణాచలంకు బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు అక్కడ చేరుకుంటారు. అక్కడ ఉన్న హోటల్లో చెక్ ఇన్ చేసిన తరువాత, యాత్రికులు అరుణాచలేశ్వరస్వామి దర్శనాన్ని తీసుకుంటారు. ఆ రోజు రాత్రి అరుణాచలంలోనే బస చేస్తారు.
మూడో రోజు, ఉదయం బ్రేక్ఫాస్ట్ అనంతరం, బస్సు తిరిగి బయలుదేరుతుంది. మధ్యాహ్నం, యాత్రికులు వెల్లూరు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ను దర్శించుకుంటారు. దర్శనం పూర్తి చేసిన తరువాత, తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
నాలుగో రోజు, ఉదయానికీ బస్సు హైదరాబాద్ చేరుకుంటుంది.
టికెట్ చార్జీలు ఇలా ఉన్నాయి:
మనకు అందుతున్న సమాచారం ప్రకారం, వివిధ జిల్లాల నుండి అరుణాచల టూర్ ప్యాకేజీకి టికెట్ చార్జీలు ఇలా ఉన్నాయి.
- కరీంనగర్ నుండి: ₹4,610
- హైదరాబాద్ నుండి: ₹3,900
- మంచిర్యాల నుండి: ₹5,130
- నిజామాబాద్ నుండి: ₹4,340
- మెదక్ నుండి: ₹4,610
- వరంగల్ నుండి: ₹4,610
- మహబూబ్నగర్ నుండి: ₹3,690