బండ్లపై ‘ప్రెస్’, ‘పోలీస్’, ‘గవర్నమెంట్’ స్టిక్కర్లు వేస్తే.. వాహనం సీజ్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం !
- Author : Vamsi Chowdary Korata
Date : 26-01-2026 - 2:44 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana Government నకిలీ జర్నలిస్టుల బెడదకు తెలంగాణ ప్రభుత్వం కళ్లెం వేసింది. ఇకపై ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులు మాత్రమే వాహనాలపై ‘ప్రెస్’ స్టిక్కర్లు వాడాలని స్పష్టం చేసింది. అనధికారికంగా స్టిక్కర్లు వాడితే భారీ జరిమానాతో పాటు వాహనం సీజ్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది.
- జర్నలిస్టులకు అలర్ట్
- అక్రిడిటేషన్ ఉంటేనే వాహనంపై PRESS స్టిక్కర్
- ప్రెస్ లోగోలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం
- వాహనాలపై ‘ప్రెస్’ స్టిక్కర్లకు అక్రిడిటేషన్ తప్పనిసరి
- నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో పాటు వాహనం సీజ్
- అనధికారిక స్టిక్కర్లపై త్వరలో పోలీస్, రవాణా శాఖల స్పెషల్ డ్రైవ్
- వృత్తి గౌరవాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయమన్న ప్రభుత్వం
మీడియా ముసుగులో చెలామణి అవుతున్న నకిలీ జర్నలిస్టులకు కళ్లెం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ కార్డులు ( Accreditation Cards ) ఉన్న జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ‘Press’ అని స్టిక్కర్లు వేసుకోవాలని స్పష్టం చేస్తూ సమాచార, పౌర సంబంధాల శాఖ (I&PR) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో చాలా మంది కేవలం ఏదో ఒక యూట్యూబ్ ఛానెల్ లేదా ప్రైవేట్ సంస్థ ఐడీ కార్డు చూపిస్తూ వాహనాలపై ‘ప్రెస్’ స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్నారని, దీనివల్ల అసలైన జర్నలిస్టుల ప్రతిష్ట దెబ్బతింటోందని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
సెంట్రల్ మోటార్ వెహికల్ చట్టం 1989 ప్రకారం.. అనధికారికంగా వాహనాలపై లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లపై Press, Police, Govt వంటి పదాలను వాడటం చట్టరీత్యా నేరం. అక్రిడిటేషన్ లేని వారు ఈ స్టిక్కర్లను వాడితే ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కింద పరిగణించి భారీ జరిమానాతో పాటు, అవసరమైతే వాహనాన్ని సీజ్ చేసే అధికారం కూడా రవాణా శాఖకు ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నిబంధనలు రాష్ట్రవ్యాప్తంగా కఠినంగా అమలు చేయాలని సమాచార శాఖ కమిషనర్ జిల్లా పౌర సంబంధాల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం అనేక మీడియా సంస్థలలో వేల సంఖ్యలో జర్నలిస్టులు పనిచేస్తున్నారు. వీరిలో కేవలం కొద్దిమందికి మాత్రమే ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డులను జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. కేవలం మేనేజ్మెంట్ ఇచ్చిన ఐడీ కార్డులు ఉన్న వారు తమ వాహనాలపై ‘ప్రెస్’ స్టిక్కర్లు వాడటానికి వీలుండదు. ప్రభుత్వం ఇచ్చే అధికారిక అక్రిడిటేషన్ కార్డు మాత్రమే ఇందుకు ప్రామాణికంగా ఉండనుంది. ఒకవేళ ఎవరైనా అక్రిడిటేషన్ లేకుండా స్టిక్కర్లు వాడుతుంటే, వాటిని వెంటనే తొలగించుకోవాలని, లేనిపక్షంలో పోలీస్, రవాణా శాఖల ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
నిజానికి, నకిలీ జర్నలిస్టుల సంఖ్య పెరిగిపోవడంతో టోల్ ప్లాజాల వద్ద, పార్కింగ్ స్థలాల్లో, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ అరాచకానికి అడ్డుకట్ట వేయడం ద్వారా వృత్తిపట్ల నిబద్ధత గల జర్నలిస్టులకు సరైన గుర్తింపు, గౌరవం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, అక్రిడిటేషన్ లేని క్షేత్రస్థాయి రిపోర్టర్లకు ఇది కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నప్పటికీ, వృత్తి గౌరవాన్ని కాపాడేందుకు ఇది అనివార్యమని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.