Hydra : గగన్పహాడ్లో హైడ్రా టీమ్.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు
అప్పచెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లు, భవనాలు, షెడ్లను భారీ బుల్డోజర్లతో కూల్చివేశారు.
- Author : Pasha
Date : 31-08-2024 - 10:23 IST
Published By : Hashtagu Telugu Desk
Hydra : ఇవాళ ఉదయాన్నే హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) టీమ్ గగన్పహాడ్లో రంగంలోకి దిగింది. ఆ ఏరియాలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలను మొదలుపెట్టారు. అప్పచెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన ఇళ్లు, భవనాలు, షెడ్లను భారీ బుల్డోజర్లతో కూల్చివేశారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు జరిగాయి. హైడ్రా దూకుడుతో హైదరాబాద్ నగరంలోని అక్రమార్కులు, కబ్జాకోరులకు చుక్కలు కనిపిస్తున్నాయి.చెరువులు, నాలాలను ఆక్రమించి భవనాలు నిర్మించుకున్న వారి కంటిమీద కునుకు లేకుండాపోయింది. అలా నిర్మించిన భవనాల లిస్టును తయారు చేసి, ఒకదాని తర్వాత ఒకటిగా హైడ్రా టీమ్(Hydra) కూల్చేస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలంలో ఉన్న పలు చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించనున్నారు. అమీన్పూర్లోని వెంకటరమణ కాలనీ, చక్రపురి కాలనీలలో సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించనున్నారు. దీంతో అక్కడ అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read :Judge VS Elon Musk : మస్క్కు షాక్.. ‘ఎక్స్’ సేవలు ఆపేయాలని సంచలన ఆదేశాలు
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు హైడ్రా గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపి దీన్ని ఏర్పాటు చేశారు. చెరువులు, కుంటల కబ్జాలను ఆపడమే హైడ్రా ప్రధాన టార్గెట్. చెరువులు, నాలాల ఆక్రమణలతో హైదరాబాద్ మహానగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీన్ని సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్ హైడ్రాను ఏర్పాటు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు హైడ్రా పరిధిని విస్తరించారు.హైడ్రాకు ఛైర్మన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తుండగా, దీనికి కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ కమిషర్గా ఉన్నారు. అందుకే నిర్భయంగా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేయ గలుగుతోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖుల అక్రమ నిర్మాణాలను ఈవిధంగా కూల్చేశారు.