Rains Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన
Rains Alert : తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
- By Kavya Krishna Published Date - 11:31 AM, Wed - 13 August 25

Rains Alert : తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఇవాళ (ఆగస్టు 13) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది వచ్చే 48 గంటల్లో మరింత బలపడనుందని తెలిపింది. అలాగే ఉత్తర అంతర్గత కర్ణాటక, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఈ రోజు (ఆగస్టు 13) తెలంగాణలోని హన్మకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, జగిత్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, గంటకు 40–50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియానికి బిగ్ షాక్.. ఆర్సీబీ జట్టే కారణమా?!
రేపు (ఆగస్టు 14) మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జనగాం, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, నేడు పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్రలో పలు చోట్ల అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. అధికారులు మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Manchu Lakshmi: బెట్టింగ్ యాప్ కేసు.. రేపు విచారణకు మంచు లక్ష్మి!