Telangana Weather Updates: తెలంగాణకు భారీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక..
- Author : Vamsi Chowdary Korata
Date : 24-06-2026 - 9:39 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుభవార్త అందించింది. రాష్ట్రంలో జూన్ 8వ తేదీనే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు తొలుత మందకొడిగా కదిలాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అసాధారణ ఉష్ణ పరిస్థితుల ప్రభావం రుతుపవనాల గమనంపై తీవ్రంగా పడటంతో.. ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి దాదాపు 15 రోజుల సుదీర్ఘ సమయం పట్టింది. ఎట్టకేలకు మంగళవారం నాటికి ఈ నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి రాబోయే మూడు రోజుల పాటు విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. నేడు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 25న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వానలు దంచికొట్టనున్నాయి. జూన్ 26వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఈ ప్రధాన జిల్లాలతో పాటు.. రాష్ట్రంలోని మిగిలిన ఇతర జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ప్రజలు, రైతులు వాతావరణ మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలు జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు విస్తృతంగా వర్షాలు కురిశాయి. పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలం కూనారంలో ఏకంగా 17.1 సెం.మీల భారీ వర్షం నమోదయ్యింది. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. అలాగే రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల్లో చాలా చోట్ల జనజీవనం స్తంభించేలా భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ నగరవ్యాప్తంగా కూడా రహదారులు జలమయమయ్యేలా వానలు పడ్డాయి. సంగారెడ్డి, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, ఆదిలాబాద్ జిల్లాల్లో మంగళవారం పగటి పూట సైతం వానలు దంచికొట్టాయి.
ఎల్నినో ముప్పు తీవ్రం
మరోవైపు పర్యావరణానికి సంబంధించి అంతర్జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఇన్కాయిస్) ఒక హెచ్చరిక బులెటిన్ను విడుదల చేసింది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఇన్కాయిస్ డైరెక్టర్ బాలకృష్ణన్ నాయర్ సమక్షంలో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో మరింత బలపడుతోంది. ఇది నవంబరు నుంచి వచ్చే ఏడాది జనవరి మధ్య కాలంలో అత్యంత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు 2027 ఏప్రిల్, మే నెలల వరకు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతాయి.
ఈ ఎల్నినో ప్రభావం కేవలం ఉష్ణోగ్రతలకే పరిమితం కాకుండా.. 2027 మార్చి దాకా పర్యావరణ, మత్స్య రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత వర్షాకాలంలో బంగాళాఖాతంలో సముద్రం తీవ్ర అలజడిగా మారుతుందని, ఫలితంగా భారతదేశ తూర్పు తీరప్రాంతంలో తీరం భారీగా కోతకు గురికావడమే కాకుండా ఊహించని రీతిలో వరదలు వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉందని ఇన్కాయిస్ బులెటిన్ హెచ్చరించింది.