Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ
- Author : Prasad
Date : 30-05-2026 - 11:15 IST
Published By : Hashtagu Telugu Desk
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు అజారుద్దీన్, కోదండరాంల నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నామినేషన్లకు సంబంధించిన ఫైళ్లు, ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే సమర్పించాలని కోరిన పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరిస్తూ తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. బీఆర్ఎస్ నాయకుడు కుర్రా సత్యనారాయణ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులో నామినేషన్లకు దారితీసిన నోట్ ఫైళ్లు, ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు ముందుంచాలని కోరారు. అయితే ఈ అభ్యర్థనపై తక్షణ ఆదేశాలు జారీ చేయడానికి ధర్మాసనం నిరాకరించింది. పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్, తెలంగాణ మంత్రివర్గం ఇటీవల ఒక పాత పేరు, ఒక కొత్త పేరును గవర్నర్కు సిఫార్సు చేసిందని, ఆ సిఫార్సులను గవర్నర్ ఆమోదించారని కోర్టుకు వివరించారు. ఈ నిర్ణయానికి దారితీసిన కారణాలను రికార్డులో నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్ స్పందిస్తూ, గవర్నర్కు సిఫార్సులు చేయడం, వాటిని ఆమోదించడం కార్యనిర్వాహక విచక్షణ పరిధిలోకి వచ్చే అంశమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన ఆర్ వెంకటరమణి .. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే గవర్నర్ వ్యవహరించారని వాదించారు.
మధ్యంతర దరఖాస్తుపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అలాగే మహమ్మద్ అజారుద్దీన్ తరఫున దాఖలైన ఇంప్లీడ్మెంట్ పిటిషన్ను తదుపరి దశలో పరిశీలిస్తామని పేర్కొంది. అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు, కేసు విచారణను జూలై 22కు వాయిదా వేసింది.