తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
తెలంగాణలో అమలవుతున్న ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (EHS) అనేక సమస్యలతో సతమతవుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ఈ సేవలకు ప్రభుత్వం నుంచి నిధుల విడుదల సకాలంలో జరగకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు హెల్త్ కార్డులను అంగీకరించడం లేదు
- Author : Sudheer
Date : 11-02-2026 - 12:00 IST
Published By : Hashtagu Telugu Desk
Good news for Telangana Government Employees : తెలంగాణలో అమలవుతున్న ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ (EHS) అనేక సమస్యలతో సతమతవుతుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అందిస్తున్న ఈ సేవలకు ప్రభుత్వం నుంచి నిధుల విడుదల సకాలంలో జరగకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు హెల్త్ కార్డులను అంగీకరించడం లేదు. దీనివల్ల ఉద్యోగులు అత్యవసర సమయాల్లో తమ జేబు నుండి లక్షల రూపాయలు వెచ్చించి, తర్వాత రీయింబర్స్మెంట్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులను తొలగించి, కార్పొరేట్ స్థాయిలో పక్కాగా నగదు రహిత (Cashless) చికిత్స అందించడమే లక్ష్యంగా ‘న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్’ కు ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీని కోసం ప్రత్యేకంగా ‘ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్’ (EHCT) ఏర్పాటు కానుంది.
ఈ కొత్త పథకంలో అత్యంత కీలకమైన మార్పు ‘ఉద్యోగుల భాగస్వామ్యం’. ఇప్పటివరకు ఉచితంగా ఉన్న పథకం కాస్తా, ఇప్పుడు ఉద్యోగి తన బేసిక్ పే (Basic Pay) నుండి 1.5% వాటాను కాంట్రిబ్యూషన్గా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ జీతం రూ.50,000 ఉంటే, నెలకు రూ.750 చెల్లించడం ద్వారా పూర్తి స్థాయి కార్పొరేట్ వైద్య సదుపాయం పొందుతారు. ఇన్సూరెన్స్ కంపెనీల కంటే ప్రభుత్వమే ఒక ట్రస్టుగా ఏర్పడి నిర్వహించడం వల్ల క్లెయిమ్ సెటిల్మెంట్లు వేగంగా జరుగుతాయని, తద్వారా ఆసుపత్రులు చికిత్సను నిరాకరించే పరిస్థితి ఉండదని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 12న నిర్వహించనున్న కీలక సమావేశంలో విధివిధానాలు ఖరారు కానున్నాయి.
ఉద్యోగ సంఘాలు ఈ కాంట్రిబ్యూషన్ విధానాన్ని సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, ప్రభుత్వం కూడా తన వంతు సమాన వాటాను (Matching Contribution) జమ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. గతంలో రీయింబర్స్మెంట్ బిల్లులు సగానికి పైగా కట్ అవ్వడం, పెండింగ్లో పడటం వంటి చేదు అనుభవాల దృష్ట్యా, కొత్త పథకంలో ‘ఓపెన్ ఎండెడ్’ పాలసీ ఉండాలని వారు కోరుతున్నారు. అంటే ఎటువంటి పరిమితులు లేకుండా వ్యాధి తీవ్రతను బట్టి పూర్తి ఖర్చును ప్రభుత్వం భరించాలి. ఈ క్రమంలో సెక్రటేరియట్లో జరగబోయే ఉన్నత స్థాయి సమావేశం రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల ఆరోగ్య భద్రతను నిర్ణయించనుంది.