Harish Rao: బీఆర్ఎస్ పోరాటానికి భయపడే రేవంత్ రుణమాఫీ ప్రకటన చేశారు: మంత్రి హరీశ్ రావు
- Author : Balu J
Date : 16-04-2024 - 9:04 IST
Published By : Hashtagu Telugu Desk
Harish Rao: పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తామని హామీ ఇస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. డిసెంబర్ 9న ఆడే రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట తప్పినందుకు సీఎం రైతులకు క్షమాపణ చెప్పాలని, రుణమాఫీ కోసం బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటానికి భయపడే రేవంత్ ఈ ప్రకటన చేశారన్నారు.
ఎకరానికి 15000 చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇంకా ఎందుకు ఇవ్వలేదు ? వ్యవసాయ కూలీలకు 12000 ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదు? అని హరీశ్ రావు ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు 2500 చొప్పున ఇస్తామన్న హామీ ఏమయిందిదని, 4 వేలకు పెంచుతామన్న పెన్షన్ను ఎప్పుడు పెంచి ఇస్తారని హరీశ్ రావు మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేసే సిద్ధ శుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓడిపోతామని భయంతోనే మళ్లీ కొత్తగా హామీలు ఇస్తున్నారని, తెలంగాణ ప్రజలు మీపై నమ్మకం కోల్పోయారని హరీశ్ రావు అన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఆగస్టు 15లోగా రూ.2 లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని రేవంత్రెడ్డి ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం నారాయణపేటలో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.