Urea : తెలంగాణలో యూరియా కష్టాలు.. పార్లమెంట్లో గళం విప్పిన ఎంపీ చామల కిరణ్
Urea : కేంద్ర ప్రభుత్వం నుండి యూరియా సరఫరాలో తీవ్ర జాప్యం జరగడంతో, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
- Author : Sudheer
Date : 19-08-2025 - 2:03 IST
Published By : Hashtagu Telugu Desk
రైతులకు సాగు కాలంలో యూరియా (Urea) లభ్యత ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణలో ప్రస్తుతం ఇదే సమస్య రైతులను తీవ్రంగా వేధిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుండి యూరియా సరఫరాలో తీవ్ర జాప్యం జరగడంతో, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొలాలకు యూరియా వేయాల్సిన సమయం ఆసన్నమైనా, మార్కెట్లో యూరియా లభించడం లేదు. దీంతో రైతులు గంటల తరబడి ఎరువుల దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. అయినా వారికి నిరాశే ఎదురవుతోంది. ఈ పరిస్థితి రాష్ట్రంలోని వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
తెలంగాణలో యూరియా సంక్షోభంపై పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) లోక్సభలో ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ ఖరీఫ్ సీజన్కు కేంద్రం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు కేవలం 4.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసిందని ఆయన ఆరోపించారు. ఆగస్టు 13 నాటికి 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 2.10 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడిందని ఆయన వివరించారు. ఈ కొరత వల్ల రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Cotton imports : అమెరికా టారిఫ్ల పెంపు .. పత్తి దిగుమతులపై సుంకాల ఎత్తివేత
యూరియా కొరతపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల నిరసన ప్రదర్శన కూడా నిర్వహించారు. కేంద్రం తెలంగాణకు సరఫరా చేయాల్సిన యూరియాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా యూరియాను సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఎంపీలు గుర్తు చేశారు.
ఈ యూరియా సంక్షోభం రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి కేంద్రాన్ని తప్పు పడుతుండగా, కేంద్రం సరఫరాలో ఎలాంటి లోపం లేదని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రాజకీయ పోరాటంలో రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. పంట దిగుబడిపై ఆశలు పెట్టుకున్న రైతన్నలకు యూరియా కొరత పెద్ద అడ్డంకిగా మారింది. ఈ సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తేనే పంటను కాపాడుకోగలమని రైతులు ఆశిస్తున్నారు.