WittyLeaks : ‘విట్టీ లీక్స్’ను విడుదల చేసిన సీఎం రేవంత్
వాటిలో అత్యంత కీలకమైన కథనాలను కలగలిపి ఒక సంకలనంగా చేసి విట్టీ లీక్స్ (WittyLeaks) పుస్తకాన్ని రూపొందించారు.
- By Pasha Published Date - 09:23 AM, Thu - 3 October 24
WittyLeaks : సీనియర్ జర్నలిస్ట్ సాయే శేఖర్ రచించిన ‘విట్టీ లీక్స్’ పుస్తకం విడుదలైంది. హైదరాబాద్లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమం వేదికగా ఈ పుస్తకాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 1988 నుంచి ఇప్పటివరకు జర్నలిస్టుగా సాయే శేఖర్ విశిష్ఠ సేవలు అందించారు. ఈ సుదీర్ఘ జర్నలిజం కెరీర్ ప్రస్థానంలో ఆయన ఎన్నో విలువైన వార్తా కథనాలు రాశారు. వాటిలో అత్యంత కీలకమైన కథనాలను కలగలిపి ఒక సంకలనంగా చేసి విట్టీ లీక్స్ (WittyLeaks) పుస్తకాన్ని రూపొందించారు.
Also Read :Tollywood Reacts: టాలీవుడ్ దెబ్బకు దిగొచ్చిన మంత్రి.. సమంతకు క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ!
జర్నలిస్టుగా ఈనాడు దినపత్రికలో కెరీర్ను మొదలుపెట్టిన సాయే శేఖర్ నేటి వరకు ఎన్నో కథనాలు రాశారు. ఎన్టీ రామారావు, మర్రి చెన్నారెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి వంటి ఎంతోమంది పాలనా తీరును ఆయన దగ్గరి నుంచి నిశితంగా గమనించారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు, కర్ణాటక మాజీ సీఎం ఎస్.బంగారప్ప, ఐటీసీ మాజీ ఛైర్మన్ యోగి దేవేశ్వర్ వంటి ప్రముఖుల వార్తలను కవర్ చేసే క్రమంలో ఎదురైన అనుభవాల వివరాలను కూడా విట్టీ లీక్స్ పుస్తకంలో పొందుపరిచారు.
Also Read :Chaitu – Sam Divorce : కొండా సురేఖ కామెంట్స్ పై అక్కినేని ఫ్యామిలీ సభ్యుల రియాక్షన్
ఎన్టీ రామారావు మరణం వేళ తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, ఆనాటి రాజకీయ పరిణామాలను ఈ బుక్లో కళ్లకు కట్టేలా అక్షరబద్ధం చేశారు. ప్రజలు తెలుసుకోకుండా ఉండిపోయిన విలువైన అంశాలను ఒక చోట చేర్చి పుస్తక రూపం కల్పించడం చాలా గొప్ప విషయమని ఈసందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ సాయే శేఖర్ను సీఎం రేవంత్ అభినందించారు. తన తొలి పుస్తకం విడుదలకు సాయం అందించిన సీఎం రేవంత్ రెడ్డికి ఈసందర్భంగా సాయే శేఖర్ ధన్యవాదాలు తెలిపారు.