BRS South Sketch : దక్షిణ తెలంగాణపై KCR ప్లాన్ B
RS South Sketch : తెలంగాణ సీఎం కేసీఆర్ సర్వేలను విశ్వసిస్తారు. వాటిని బేస్ చేసుకుని వ్యూహాలను రచిస్తుంటారు.
- By CS Rao Published Date - 03:45 PM, Tue - 29 August 23
BRS South Sketch : తెలంగాణ సీఎం కేసీఆర్ సర్వేలను విశ్వసిస్తారు. వాటిని బేస్ చేసుకుని వ్యూహాలను రచిస్తుంటారు. తాజాగా అందిన సర్వేల ప్రకారం దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రాబల్యం బలహీనం ఉందని సారాంశమట. అందుకే, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల మీద ప్రత్యేక నిఘా పెట్టారని ప్రగతిభవన్ వర్గాల్లోని టాక్. ఆ మూడు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తాజా సర్వే సారాంశమట. వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ మరింతగా దక్షిత తెలంగాణ అంతటా బలహీనపడుతుందని ఆ పార్టీ వర్గాల్లోని చర్చ.
దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ (BRS South Sketch)
తొలి నుంచి దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ (BRS South Sketch)బలహీనం. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో లీడర్లతో పాటు క్యాడర్ కూడా అంతంత మాత్రమే. ప్రస్తుతం ఆ పార్టీకి మంత్రి పువ్వాడ అజయ్ మాత్రమే చెప్పుకోదగ్గ లీడర్ ఖమ్మం జిల్లాల్లో ఉన్నారు. కమ్యూనిస్ట్ లు కాంగ్రెస్ పార్టీతో చేయి కలిపిన మరుక్షణం ఆయన ప్రాబల్యం కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే, కమ్యూనిస్ట్ క్యాడర్ ఆయన వెంట ఉంది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ ల పొత్తు ఖరారు అయితే ఆ క్యాడర్ జారుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వత్రా వినిపిస్తోంది. ఇక ఎంపీ నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నప్పటికీ ఆయనకు బలమైన అనుచరవర్గం లేదని వినికిడి. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన నామా రాజకీయాలను ఎన్నికల వరకు మాత్రమే పట్టించుకుంటారు. ఆ తరువాత వ్యాపారాల్లో మునిగితేలుతుంటారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీడర్ల మధ్య గ్రూప్ విభేదాలు
నల్లొండ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన లీడర్ల మధ్య గ్రూప్ విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయని అధిష్టానం వద్దకు సమాచారం చేరిందట. మంత్రి జగదీశ్వరెడ్డి మొదలుకొని ఆ పార్టీలోని సిట్టింగ్ ల మీద వ్యతిరేకత ఉంది. గ్రూపులుగా విడిపోయిన పార్టీని ఏకం చేయడానికి తెలంగాణ భవన్ టీమ్ పనిచేస్తోంది. సిట్టింగ్ లను మార్చకపోతే, వచ్చే ఎన్నికల్లో రెబల్స్ ఎక్కువగా ఉండే విధంగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నల్గొండలో ఉంది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీకి బలమైన లీడర్లు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ లోని ఉద్దండులు. వాళ్లను కాదని ఈసారి బీఆర్ఎస్ (BRS South Sketch) అక్కడ నిలబడే పరిస్థితి లేదని టాక్.
సిట్టింగ్ ల మీద ఉన్న వ్యతిరేకత,
మహబూబ్ నగర్ జిల్లా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చెందిన సొంత జిల్లా. ఆ జిల్లా మీద పట్టు సాధించడానికి రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా ప్రయత్నం చేస్తోంది. గత ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిని ఓడించిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి జిల్లా వ్యాప్తంగా హవాను (BRS South Sketch) చాటాలని ప్రయత్నం చేస్తోంది. కానీ, సిట్టింగ్ ల మీద ఉన్న వ్యతిరేకత, ఆ జిల్లాకు చెందిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవహారం వెరసి బీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉండడానికి కారణంగా కనిపిస్తోందని సర్వేల అంచనా. అందుకే, దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ సరికొత్త ఎత్తుగడను వేస్తున్నారని తెలుస్తోంది.
Also Read : BRS list strategy : KCR వ్యూహాలకు అర్థాలు వేరు.!
మూడు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తుందని సర్వేలను అందుకున్న గులాబీ బాస్ వెంటనే ప్రత్యేక బృందాలను అక్కడకు పంపారట. క్షేత్రస్థాయిలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని తక్షణం మార్పులు చేర్పులు చేయడానికి సమాయాత్తం అవుతున్నారని తెలుస్తోంది. ప్రగతిభవన్ కు నిత్యం టచ్ లో ఉండే లీడర్లకు ఆ జిల్లాల మీద పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారని తెలుస్తోంది. ఎక్కడైతే, బీజేపీ బలహీనంగా ఉందో, అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందట. అందుకే, కాంగ్రెస్ ను బలహీనపరచడం మొదటి ప్రాధాన్యం. రెండో ప్రాధాన్యంగా బీజేపీని పరోక్షంగా బలపడేలా చేస్తే ఓట్లు చీలిపోతాయని వ్యూహం. ఇలా సరికొత్త వ్యూహాలకు పదును పెడుతూ దక్షిణ తెలంగాణలోనూ ఈసారి పైచేయిగా (BRS South Sketch)నిలవాలని ప్రత్యేక టీమ్ లను నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ కు పంపారని తెలుస్తోంది.
Also Read : KCR Politics : నల్గొండ BRS కు గ్రూప్ ల బెడద
దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా ప్లాన్ బీని అమలు చేయడానికి కేసీఆర్ స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఎన్నికల బరిలోని కొందరు అభ్యర్థులకు నిధులు సమకూర్చడం ద్వారా ముందుగానే లోబరుచుకోవడం ప్లాన్ బీ లోని మొదటి అంశం. ఒక వేళ అసరమైతే, ఎన్నికలు ముగిసిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కూడా ఇప్పుడే స్కెచ్ తయారు చేశారట. ఆ క్రమంలోనే దక్షిణ తెలంగాణలోని కాంగ్రెస్ అభ్యర్థుల మీద ప్రత్యేక నిఘా పెట్టారని రాజకీయ వర్గాల్లోని చర్చ.
Related News
Rahul Gandhi Nomination: రాహుల్ గాంధీ నామినేషన్ కోసం యూపీకి బయల్దేరిన సీఎం రేవంత్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఏఐసీసీ జాతీయ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో కలిసి శుక్రవారం హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ఉత్తరప్రదేశ్కు ప్రత్యేక విమానంలో బయలుదేరారు