Shock To BRS: బీఆర్ఎస్ కు గట్టి షాక్.. కీలక నేత రాజీనామా
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది . బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు ఆ పార్టీ సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్ ప్రకటించాడు
- Author : Vamsi Chowdary Korata
Date : 21-01-2024 - 9:33 IST
Published By : Hashtagu Telugu Desk
Shock To BRS: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది . బీఆర్ఎస్ కు రాజీనామా చేసినట్లు ఆ పార్టీ సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్ ప్రకటించాడు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ .. బీఆర్ఎస్ పార్టీని దేవుడు కూడా కాపాడలేడని, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకుల పట్ల నాయకత్వ తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పార్టీని తిరస్కరించినా, నాయకత్వం తన వైఖరి మార్చుకోలేదని, స్వీయ తప్పిదాలను సొంతం చేసుకుంటుందన్నారు.
పార్టీ ఓటమి ప్రజల తప్పిదమని ఆ పార్టీ అగ్రనేతలు సైతం అనడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. బీఆర్ఎస్లో ఉండలేకే పార్టీకి రాజీనామా చేశానన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీని ప్రపంచ స్థాయి ప్రాజెక్టుగా ప్రచారం చేస్తూ కోట్లాది రూపాయలతో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలడం పార్టీకి పెద్ద దెబ్బేనని అన్నారు . అవినీతి, అక్రమాలతో ప్రాజెక్టు ఆగిపోయిందని, ప్రతిపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయన్నారు.
పార్టీని వీడేందుకు 100 కారణాలు ఉన్నాయని, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు ఆ పార్టీని ఆదరించే పరిస్థితి లేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాను పార్టీ నుంచి బయటకు వచ్చానని, శ్రేయోభిలాషులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని శ్రీనివాస్ తెలిపారు.
Also Read: BRS: ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వం జీవోలు వెంటనే విడుదల చేయాలి