MLC Kavitha : ఇవాళ ట్రయల్ కోర్టులో ఎమ్మెల్సీ కవిత విచారణ
ఈ సందర్భంగా కవితకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
- Author : Pasha
Date : 28-08-2024 - 10:41 IST
Published By : Hashtagu Telugu Desk
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఆమె ఇవాళ మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరనున్నారు. సాయంత్రం 4:45 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో ల్యాండ్ అవుతారు. ఈ సందర్భంగా కవితకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎయిర్ పోర్ట్ నుంచి కవిత నేరుగా తన నివాసానికి చేరుకోనున్నారు.ఇక ఈ స్కాంలో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. ఈ విచారణకు కవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని వసంత్ విహార్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కవిత(MLC Kavitha) ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join
కవిత దాదాపు 166 రోజుల పాటు ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు. ఎట్టకేలకు ఆమెకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ కేసులో కవితకు బెయిల్ ఇచ్చే క్రమంలో సుప్రీంకోర్టులో పలు షరతులు విధించింది. ఈడీ, సీబీఐ కేసుల్లోనూ రూ.10 లక్షలు చొప్పున పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. పాస్పోర్టును విచారణ కోర్టు న్యాయమూర్తి వద్ద డిపాజిట్ చేయాలని కవితకు సూచించింది. సాక్షులను ప్రభావితం చేయడం కానీ బెదిరించడం కానీ చేయరాదని సూచించింది. కోర్టు విచారణలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని తెలిపింది.
Also Read :Gujarat Floods : వరద వలయంలో గుజరాత్.. సురక్షిత ప్రాంతాలకు 23,870 మంది
అంతకుముందు తిహార్ జైలు నుంచి విడుదలయ్యాక కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఐదున్నర నెలల తర్వాత కుటుంబ సభ్యులను కలవబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఒక తల్లిగా పిల్లల్ని వదిలేసి ఐదున్నర నెలలు ఏనాడూ ఉండలేదు. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం. నేను కేసీఆర్ బిడ్డను. తెలంగాణ బిడ్డను. కమిట్మెంట్తో పనిచేస్తాను’’ అని కవిత వ్యాఖ్యానించారు.